గ్యాంగ్ రేప్, మహిళ హత్య: టిఎంసి కార్యకర్తలపై ఆరోపణ
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సామూహిక అత్యాచారం చేసి మహిళను హత్య చేసిన సంఘటన తీవ్ర దుమారం రేపుతోంది. గత రాత్రి తన భార్యను తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు గ్యాంగ్ రేప్ చేసి, నగ్నంగా ఊరేగించి, హత్య చేశారని సిపిఎం కార్యకర్త ఒకరు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెసు ఖండిస్తోంది.
ఈ వివాదానికి సంబంధించిన వార్తాకథనాలు జాతీయ మీడియాలో వచ్చాయి. తన భార్యపై జరిగిన ఘోరంపై సిపిఎం కార్యకర్తల పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. మృతురాలి భర్త ఆరోపణను సిపిఎఁ నాయకుడు, మాజీ మంత్రి చక్రధర్ మైకాప్ సమర్థించారు.
మహిళ శవం గత రాత్రి తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని సునియా గ్రామంలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. 12 లక్షల జరిమానాను చెల్లించడంలో విఫలమైనందుకు ఆ మహిళపై తృణమూల్ కాంగ్రెసు కార్యకర్తలు దాడి చేసినట్లు చెబుతున్నారు. 2011 ఎన్నికల్లో ఆ ప్రాంతంలో సిపిఎం తుడిచిపెట్టుకుపోయింది. దాంతో మహిళ భర్త ఊరి నుంచి వేరే ప్రాంతానికి పారిపోయాడు.
పశ్చిమ బెంగాల్ గ్రామీణ ప్రాంతంలో బలవంతపు వసూళ్లు మామూలేనని, రాజకీయ ప్రత్యర్థుల నుంచి అలా జరిమానాల రూపంలో వసూలు చేస్తారని అంటున్నారు.