పరస్పరం షూట్ చేసుకుని పోలీసు ఆఫీసర్స్ మృతి, ఓనర్ను కొట్టి చంపిన టెనెంట్స్
భోపాల్/లక్నో: మధ్యప్రదేశ్లో విచారకర సంఘటన జరిగింది. సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీసు, టౌన్ ఇన్స్పెక్టర్.. వీరిద్దరు ఒకరిని మరొకరు పరస్పరం షూట్ చేసుకొని మృతి చెందారు. ఈ సంఘటన నివాడీ రోడ్ టౌన్లో జరిగింది. ఓ విషయమై ఇద్దరు మధ్య వాదనలు జరిగాయి. అప్పుడు పరస్పరం కాల్చుకున్నారు.
మృతి చెందిన వారిని ఎస్డీవోపీ కేసీ మాలిక్, ఇన్స్పెక్టర్ ప్రమోద్ చతుర్వేదిలుగా గుర్తించారు. ఇద్దరు కూడా ప్రథ్వీపుర్ పోలీసు స్టేషన్ ఏరియాలో విధులు నిర్వహిస్తున్నారు.
సమాచారం మేరకు.. చతుర్వేది, మాలిక్ల మధ్య ఓ విషయమై తీవ్ర వాగ్వాదం జరిగింది. పరస్పరం దూషించుకున్నారు. ఆ కోపంలో వారిద్దరు తమ తమ సర్వీస్ రివాల్వర్లతో పరస్పరం కాల్చుకున్నారు. వెంటనే వారిని పృథ్వీపుర్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్లుగా వైద్యులు చెప్పారు.
ఆసుపత్రికి చెందిన డాక్టర్ ఎంకే జైన్ మాట్లాడుతూ.. వారిద్దరు కూడా బుల్లెట్ కారణంగానే చనిపోయినట్లు చెప్పారు. మాలిక్ ఇటీవలే పృథ్వీపుర్ పోలీసు స్టేషన్కు వచ్చారు.
యజమానిని కొట్టి చంపిన కిరాయిదారులు
ఉత్తర ప్రదేశ్లో ఓ 42 ఏళ్ల వ్యక్తిని కిరాయిదారులు కొట్టి చంపారు! ఈ సంఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. యజమాని ఇర్ఫాన్. అలిఘర్ రోడ్డులోని తన షాప్ను ఖాళీ చేయాలని ఇర్ఫాన్ కిరాయిదారులైన నాసిర్, అతని కొడుకులను అడిగాడు. ఈ సమయంలో వాగ్వాదం జరిగింది. నాసిర్, అతని కొడుకులు ఇర్ఫాన్ను కొట్టారు. దీంతో అతను మృతి చెందాడు.
యాసిడ్ దాడి చేస్తామని బాలికకు బెదిరింపు
ముజఫర్ నగర్లోని ఓ కళాశాలలో చదువుతున్న బాలికను ఇద్దరు యువకులు బెదిరించారు. గత కొద్ది రోజులుగా ఆమెను ఇద్దరు యువకులు వేధిస్తున్నారు. ఈ విషయమై ఇరువురి మధ్య పలుమార్లు వాదనలు జరిగాయి. ఈ నేపథ్యంలో వారిద్దరు ఆమెను యాసిడ్ దాడి చేస్తామని బెదిరించారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.