కిడ్నాపైన తెలుగు ఇంజినీర్లను వదిలేసిన తీవ్రవాదులు
కోహిమా: నాగాలాండ్ రాష్ట్రంలో కిడ్నాపైన ఇద్దరు తెలుగు ఇంజినీర్లు విడుదలయ్యారు. వీరిని కిడ్నాప్ చేసింది బోడో తీవ్రవాదులేనని అనుమానించారు. రెండు రోజుల క్రితం(జులై 27న) కిడ్నాప్ చేసిన వీరిని తీవ్రవాదులు వదిలిపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజినీర్లు రఘు, ప్రతీష్ చంద్ర.. పృథ్వీ కన్ స్ట్రక్చన్స్ కంపెనీలో పని చేస్తున్నారు. ఇంజినీర్లను విడిచిపెట్టడానికి దాదాపు రూ.20 కోట్లు కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.
సొంత రాష్ట్రానికి వచ్చేందుకు స్థానిక రైల్వే స్టేషన్కు వచ్చిన వీరిని బోడో తీవ్రవాదులు జులై 27 కిడ్నాప్ చేశారు. వీరితోపాటు ఉన్న మరో ఇంజినీర్ తీవ్రవాదుల బారి నుంచి తప్పించుకుని బయటపడ్డారు. మంగళవారం కిడ్నాప్ విషయాన్ని బాధితులు పని చేస్తున్న కంపెనీ ప్రతినిధులు విజయవాడలోని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమవారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం క్షేమంగా విడిపించాలని విజ్ఞిప్తి చేశారు. కాగా, మంగళవారం సాయంత్రం కిడ్నాపైన ఇద్దరు ఇంజినీర్లను తీవ్రవాదులు వదిలిపెట్టినట్లు కంపెనీ ప్రతినిధులు వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.
ఇంజినీర్లను రక్షించండి: రామ్మోహనరావు
అంతకుముందు నాగాలాండ్లో కిడ్నాపైన విజయవాడకు చెందిన ఇద్దరు ఇంజినీర్ల విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. ఇందులో భాగంగా ఆ ఇంజినీర్లు విడుదలకు చర్యలు చేపట్టాలని నాగాలాండ్ ప్రభుత్వాన్ని కోరినట్లు న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు వెల్లడించారు. వారి విడుదలకు నాగాలాండ్ ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు.
గతంలో కూడా పలువురు తెలుగువారిని తీవ్రవాదులు కిడ్నాప్ చేసి ఆ తర్వాత వదిలిపెట్టారు. నాగమల్లేశ్వర రావు అనే తెలుగు టెక్కీ జూన్ 17న అపహరణకు గురైన విషయం తెలిసిందే. ఏపికి చెందిన ఇంజనీర్ బండ్లమూడి నాగ మల్లేశ్వరరావు (36)ను విడిచిపెట్టాలంటే రూ.6 కోట్లు చెల్లించాలని కిడ్నాపర్లు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఏపి, అసోం ప్రభుత్వాల చొరవ తీసుకున్న ఈ నేపథ్యంలో తీవ్రవాదులు నాగమల్లేశ్వర రావును విడుదల చేశారు.