మోడీ వేవ్ లేదు, శ్రమ ఎందుకు: ఉద్ధవ్, రాజ్ థాకరేపై..
ముంబై: మహారాష్ట్రలో ప్రధాని నరేంద్ర మోడీ హవా లేదని, నిజంగానే హవా ఉందనుకుంటే మోడీని ఎన్నికల కోసం విస్తృత ప్రచారం పేరిట ఎందుకు శ్రమ పెడుతున్నారని శివసేన పార్టీ అధ్యక్షులు ఉద్ధవ్ థాకరే గురువారం అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మోడీ విస్తృత ప్రచారం నిర్వహిస్తారని బిజెపి నేతలు చేస్తున్న ప్రకటనపై శివసేన ఆక్షేపణ తెలిపింది.
మోడీ గాలిలో గెలిచేస్తామని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ప్రచారానికి ఏకంగా ప్రధానినే పిలవడం ఎందుకన్నారు. గెలుపుపై అంత విశ్వాసం ఉన్నప్పుడు అన్ని సభల్లో మోడీతో మాట్లాడించాలా అన్నారు. బిజెపి నేతలు మోడీ ప్రచారానికి సంబంధించి రకరకాల ప్రకటనలు చేస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని విస్తృత ప్రచారం చేస్తారంటున్నారని, రాష్ట్రంలో మోడీ గాలి బలంగా ఉందని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు ప్రధానినే ఎందుకు ప్రచారానికి పిలిచినట్టు? అని ప్రశ్నించారు.
తాను మోడీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదన్న ఆయన బిజెపి నేతల అతిపై విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ప్రధానమంత్రి ఇంత పెద్దఎత్తున సభల్లో పాల్గొనాలని నిర్ణయించడం ఇదే మొదటిసారన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి ఈ నెల 15న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిక్కు అసోసియేషన్ శివసేనకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఎన్నికల అనంతరం రాజ్ థాకరే నాయకత్వంలోని ఎపొత్తు ఉంటుందని వస్తున్న వార్తలను ఉద్ధవ్ ఖండించారు. రాజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఫోన్లో వాకబు చేశానని అంతే తప్ప రాజకీయాలు మాట్లాడలేదన్నారు. అనంత్ గీతే రాజీనామాపై ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీతో మాట్లాడాకే తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనిపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడేది ఏమీ లేదన్నారు.
ఎన్డీయేలోనే ఉన్నాం: అనంత్ గీతే
కేంద్రమంత్రి పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి అనంత్ గీతే బుధవారం స్పష్టం చేశారు. శివసేన మహారాష్ట్రలో బీజేపీతో తెగతెంపులు చేసుకున్నప్పటీకీ.. ఎన్డీయేలో కొనసాగాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో తాను కేంద్ర కేబినెట్లో వీడేది లేదన్నారు.