సీల్డ్ కవర్లో సీబీఐ చీఫ్ సమాచారమివ్వండి: సుప్రీం
న్యూఢిల్లీ: 2జీ కుంభకోణం దర్యాప్తు వ్యవహారంలో సీబీఐ రంజిత్ సిన్హాకు సంబంధించిన సమాచారాన్ని బయటపెట్టాలని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎవరో ఏదో ప్రకటన చేశారని, దాని ఆధారంగా దర్యాప్తునకు ఆదేశించలేమని పేర్కొంది. కాబట్టి, భూషణ్ తప్పకుండా సీబీఐ డైరెక్టర్ ఇంటి అతిథుల జాబితాను వెల్లడించాలని తెలిపింది. వారి పేర్లను సీల్డ్ కవర్లో తమకు అందించాలని చెప్పింది.
ప్రశాంత భూషణ్ ఆరోపిస్తున్నట్లు, జాబితాలో పేర్కొన్న వివరాలు 90 శాతం బోగస్ అని, పదిశాతం మాత్రమే నిజం కావొచ్చని రంజిత్ సిన్హా కోర్టుకు తెలిపారు. ఈ మేరకు సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేసిన ఆయన, తనపై భూషణ్ దాఖలు చేసిన అఫిడవిట్ను తిరస్కరిస్తున్నానన్నారు. తనపై తప్పుడు సాక్ష్యాలు ఇస్తున్నారని, అదేవిధంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.
2జీ, 4జీ , బొగ్గు కుంభకోణాల కేసుల్లోని నిందితులు పలువురు రంజిత్ నిన్హాను ఆయన నివాసంలో కలుసుకుంటున్నారని, ఆయన ఇతర అధికారులెవ్వరూ లేకుండా రాత్రుళ్లు ఆలస్యంగా వారితో ఏకాంతంగా మాట్లాడుతూన్నారని ఆరోపించింది. ఎవరెవరితో సమావేశమయ్యారనే వివరాలు ఆయన నివాసంలోని లాగ్ బుక్లో ఉన్నాయని పేర్కొంటూ ఆ పుస్తకాన్ని కోర్టుకు సమర్పించింది. ఆ లాగ్ బుక్లో ఉన్నవారంతా ప్రభావపూరిత వ్యక్తులని వెల్లిడించింది. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే సిన్హాను దూరంగా ఉంచాల్సిందేనని పేర్కొంది.
స్వచ్చంద సంస్ద తరపున ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపిస్తున్నారు. లాగ్ బుక్లో నమోదయ్యే సందర్సకుల వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లపై మీడియాలో కథనాలు వచ్చాయని ప్రశాంత్ భూషణ్ గుర్తు చేశారు. అసలు అలాంటి పుస్తకమే లేదని ఒకసారి, అందులోని నమోదైన కొన్ని వివరాలు నిజమేనని, కొన్ని మాత్రం ఫోర్జరీ చేసినవి అంటూ రంజిత్ సిన్హా అన్నారని ప్రశాంత్ భూషణ్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.