యూపీఏ రగడ: ధ్యాన్చంద్ భారతరత్న సచిన్కి బదలీ!
న్యూఢిల్లీ: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోసం యూపీఏ సర్కారు హాకీ దిగ్గజం ధ్యాన్చంద్కు ద్రోహం చేసిందనే వార్తలు వెల్లువెత్తాయి. భారతరత్న అవార్డుకు అర్హుల ఎంపికలో మన్మోహన్ సింగ్ సర్కారు తన విశ్వసనీయతకు తీవ్ర విఘాతం కలిగించుకునేలా వ్యవహరించిందని ఓ పత్రిక ఆధారాలతో సహా కథనాన్ని ప్రచురించడం కలకలం సృష్టిస్తోంది.
అప్పటిదాకా క్రీడాకారులకు భారతరత్న పురస్కారం ఇచ్చే సంప్రదాయం లేదు. హాకీలో మూడుసార్లు భారత్కు ఒలింపిక్స్ బంగారు పతకాలను సాధించిపెట్టిన ధ్యాన్చంద్కు భారతరత్న ఇవ్వాలని చాలాకాలం నుంచి పలు క్రీడా సంఘాలతో పాటు ప్రజల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తున్నాయి.
యూపీఏ ప్రభుత్వం భారతరత్న గ్రహీతల జాబితాలో క్రీడాకారులను కూడా చేరుస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉన్నపళంగా ధ్యాన్చంద్ స్థానంలో సచిన్ టెండుల్కర్ పేరు చేర్చి గతేడాది పెద్ద చర్చకే తెరలేపింది. సచిన్ కూడా క్రికెట్లో భారత్ను సమున్నత స్థానంలో నిలిపిన వ్యక్తే.
తాజాగా హెడ్ లైన్స్ టుడే వెల్లడించిన కథనం ప్రకారం.. భారతరత్న అవార్డుల ప్రకటన వెలువడటానికి రెండు రోజుల ముందు వరకు కూడా క్రీడాశాఖ మంత్రి జితేంద్ర సింగ్ పంపిన సిఫారసుల మేరకు సీఎన్ఆర్ రావుతో పాటు ధ్యాన్చంద్ పేరే ఉంది. అయితే సరిగ్గా రెండు రోజుల ముందు సచిన్ పూర్తి వివరాలను సాయంత్రంలోగా పంపాలని కేంద్ర క్రీడాశాఖను ప్రధాన మంత్రి కార్యాలయం ఆదేశించిందట.
సదరు శాఖ నుంచి వివరాలను అందుకున్న మరుక్షణమే ద్యాన్చంద్ పేరు స్థానంలో సచిన్ పేరు చేరిపోయిందట. అసలు భారతరత్న పురస్కార గ్రహీతల విభాగంలో క్రీడాకారులకు కూడా చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నదే ధ్యాన్చంద్ కోసమైతే, చివరి నిమిషంలో ఆయన పేరును తొలగించడం ఏమిటనే వాదనలు వినిపిస్తున్నాయి.