గ్యాప్ లేదు: కెసిఆర్, బాబులతో వెంకయ్య భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో కేంద్ర మంత్రి ఎం. వెంకయ్యనాయుడు శనివారంనాడు విడివిడిగా సమావేశమయ్యారు. పలు సమస్యలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించినట్లు భేటీల అనంతరం వెంకయ్య నాయుడు చెప్పారు. విభజన వల్ల తలెత్తిన సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని తాను వారికి సూచించినట్లు తెలిపారు.
ఇప్పుడు కావాల్సి రాజకీయం కాదని, ఇరు రాష్ట్రాల అభివృద్ధే ధ్యేయం కావాలని ఆయన అన్నారు. సమస్యలపై ఇరు రాష్ట్రాల నివేదికలను కోరినట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నానని వెంకయ్య చెప్పారు.
సమన్వయంతో ముందుకు వెళ్తే ఇరు రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు. పలు సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించినట్లు తెలిపారు. రాజకీయ వివక్ష లేకుండా రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రాల పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోదని ఆయన చెప్పారు.
విభజన చట్టాన్ని ఇరు రాష్ట్రాలు కూడా గౌరవించాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి పని చేస్తామని ఆయన చెప్పారు. కేంద్రానికి, తెలంగాణకు మధ్య ఏ విధమైన గ్యాప్ లేదని ఆయన చెప్పారు. నివేదికలతో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఢిల్లీకి రావాలని సూచించినట్లు ఆయన తెలిపారు.