ఆకస్మిక తనిఖీ: లేట్ కమర్స్ను పట్టుకున్న వెంకయ్య
న్యూఢిల్లీ: కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు ఆకస్మిక తనిఖీ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ఎప్పటిలాగే సోమవారం కూడా తాపీగా 10 గంటలకు నిర్మాణ్ భవన్లోని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయాలకు చేరుకున్న అధికారులు, తెల్లటి పంచెతో కార్యాలయంలో పచార్లు చేస్తున్న వ్యక్తిని చూసి కంగుతిన్నారు.
కంగారుగా ఆయనకో నమస్కారం పెట్టి హడావిడిగా తమ స్థానాలకు వెళ్లి కూర్చుండిపోయారు. తెల్లటి పంచెతో పొద్దుటే కార్యాలయానికి వచ్చిన వ్యక్తి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు. ఉదయం 9.10 గంటలకే కార్యాలయానికి చేరుకున్న ఆయన గంటదాటినా సిబ్బంది జాడ లేకపోవడంతో ఆగ్రహించారు.
సుమారు 80 మంది అధికారులు ఆలస్యంగా కార్యాలయానికి హాజరు కావడం, ప్రధానంగా ప్రజాపనులశాఖ కార్యాలయంలో గైర్హాజరీ ఎక్కువగా ఉండటంతో వెంకయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆలస్యంగా వచ్చిన వారి నుంచి సంజాయిషీ కోరడంతోపాటు ఇకపై 9.15 గంటల తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ను తీసివేయాలని, ఆపై వచ్చేవారికి ఆబ్సెంట్ నమోదు చేయాలని ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు వారానికి రెండు రోజులు సెలవు కాబట్టి వారు మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆలస్యంగా వచ్చిన 80 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని వెంకయ్య నాయుడు ఆదేశించారు. కార్యాలయంలో బయో మెట్రిక్ అటెండెన్స్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.