మోడీని ముక్కలుగా నరికేస్తాం: కాంగ్రెస్ అభ్యర్థి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సహరన్పూర్ లోకసభ కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వస్తే మోడీని ముక్కలు ముక్కలుగా నరికి చంపుతామని బెదిరింపులకు గురి చేసిన ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు బయటికి వచ్చాయి.
‘ఇది గుజరాత్ రాష్ట్రం కాదు..ఉత్తరప్రదేశ్. గుజరాత్లో 4శాతం మాత్రమే ముస్లింలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లో 22శాతం ముస్లింలు ఉన్నారు. నేను మోడీతో పోరాడతా. అతనికి సరైన సమాధానం నేనే చెప్పగలను. ఉత్తరప్రదేశ్కి వస్తే మేం అతన్ని(మోడీ) ముక్కలు ముక్కలుగా నరికేస్తాం' అని ఆ వీడియోలో మసూద్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి.
మసూద్ మొదట్లో సమాజ్ వాది పార్టీ నేతగా ఉండి 2012 ఎన్నికలకు ముందు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఈ మధ్య మళ్లీ సమాజ్ వాదీ పార్టీలో చేరేందుకు ప్రయత్నించి భంగపడ్డారు. ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
కాగా, మసూద్ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం. అతని వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మసూద్ వ్యాఖ్యలపై తమ వైఖరేంటో స్పష్టత ఇవ్వాలని మసూద్కు ఈసీ నోటీసులు జారీ చేసింది. తన వాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో మసూద్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/1HUB8Ph1oxo?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>