విశాల్ షాక్: పైరసీపై ఫిర్యాదుతో ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: సినీ హీరో విశాల్ ఫిర్యాదుతో ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. విశాల్ ప్రస్తుతం పూజై చిత్రంలో నటిస్తున్నారు. ఆయన సరసన శృతహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రం షూటింగ్ కారైకుడిలో జరుగుతోంది.
షూటింగ్ పూర్తి కాగానే విశాల్ తన బస చేసిన హోటల్కు వెళ్లి కాసేపు టీవీలో ప్రసారమవుతున్న కార్యక్రమాలను చూశారు. ఆ తర్వాత స్థానిక చానెల్స్ను చూసిన విశాల్ షాక్కు గురయ్యారు. ఇటీవల విడుదలైన రెండు తమిళ చిత్రాలను ఎలాంటి హక్కుల లేకుండా ప్రదర్శిస్తున్న విషయాన్ని ఆయన గమనించారు. దీంతో విశాల్ కారకుడై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో రంగంలోకి దిగిన పోలీసులు పైరసీకి పాల్పడిన పళ్లత్తూర్ ముహ్మద్ మంజూర్, సంపత్లను అరెస్టు చేశారు. వారి నుంచి పైరసీ సీడీల తయారీకి ఉపయోగించిన కంప్యూటర్ను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.వదకుర్రీ, ఉన్ సమయాల్ అరాయిల్ అనే కొత్త సినిమాలను పైరసీ సీడిలను తయారు చేసినట్లు గుర్తించారు.
కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి రేయింబవళ్లు శ్రమించి రూపొందిస్తున్న చిత్రాలను పైరసీ సీడీల వాడి అక్రమంగా ప్రయోజనం పొందడం నీచమైన చర్య అని విశాల్ అన్నారు. వారి న్యాయమైన శ్రమను అక్రమంగా దొచుకుంటే చూస్తూ సహించేది లేదని ఆయన అన్నారు.