అమ్మకు సంఘీభావం, బెదిరింపు లేదు:శరత్ కుమార్
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మద్దతుగా తమిళ సినిమా పరిశ్రమ స్వచ్చందంగానే ముందుకు వచ్చిందని నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ వెల్లడించారు. తమకు తాముగానే మౌనదీక్ష చేస్తున్నామని.. దీనికోసం తమకు ఎవరి నుంచి బెదిరింపులు, ఒత్తిడి రాలేదని స్పష్టం చేశారు.
అక్రమాస్తుల కేసులో కర్ణాటక జైలులో ఉన్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మద్దతుగా తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన దర్శకులు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, నటులు, ఇతరులు మంగళవారం చెపాక్ ప్రభుత్వ అతిథి గృహం ముందు మౌనదీక్ష చేపట్టారు.
ఈ దీక్షపై తమపై ఎవరూ ఒత్తిడి చేయలేదని నటుడు శరత్ కుమార్ తెలిపారు. తమిళ సినిమా పరిశ్రమకు అమ్మ (జయలలిత) ఎంతో చేశారని, ఆపద సమయంలో ఆమెకు అండగా నిలవాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు.
ఈ నిరాహార దీక్ష ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ నిరాహార దీక్షలో విక్రమ్, కార్తీ, వేముని, మనో బాల, సాచు, ఎం.ఎస్ భాస్కర్, దర్శకుడు కె భాగ్యరాజ్, పి వాసు, ఎస్ జే సూర్య తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి, దక్షిణ భారత సినీ నటుల సంఘం పాల్పంచుకునున్నాయి. అంతేకాక చెన్నైలోని సినిమా థియేటర్లన్నీ కూడా నేటి సాయంత్రందాకా మూతపడనున్నాయి. తమిళ చిత్ర సీమ మౌనదీక్ష నేపథ్యంలో చెన్నై పరిసరాల్లో మంగళవారం మొత్తం షూటింగ్ కార్యక్రమాలన్నీ రద్దయ్యాయి.