జూలో విద్యార్థిని చంపిన పులి, ఫోటో తీస్తూ..! (పిక్చర్స్)
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతు ప్రదర్శన శాలలో ఓ పులి విద్యార్థిని చంపింది. ఈ సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్థి పన్నెండో తరగతి విద్యార్థి. విద్యార్థిని చంపింది తెల్లపులి. విద్యార్థి పైన పులి దాడి చేయగా అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి.
వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు.. పులి ఉండే ఎన్క్లోజర్ బారీకేడ్ కాస్త తక్కువ ఎత్తులో ఉందని, దీంతో అది బయటకు దూకి అతని పైన దాడి చేసిందని చెబుతున్నారు.
కాగా, పులి దాడి, విద్యార్థి మృతి నేపథ్యంలో పలురకాల వాదనలు వినిపిస్తున్నాయి. విద్యార్థి పులి పైన రాళ్లను విసిరేశాడని, దీంతో అది బయటకు దూకి, అతని పైన దాడి చేసిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. సదరు విద్యార్థి అనుకోకుండా పులి ఉన్న ఎన్క్లోజర్లో పడిపోయాడని అంటున్నారు. విద్యార్థి ఫోటోలు తీయబోతూ ఎన్క్లోజర్లో పడిపోయినట్లుగా మరికొందరు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. విద్యార్థిని ఆదుకునేందుకు జూ అధికారులు ఏమాత్రం రాలేదని, ఆ పులి విద్యార్థి పైన పదిహేను నిమిషాలు దాడి చేసిందని చెబుతున్నారు.
పులిని ముట్టుకునే ప్రయత్నం చేయడంతో అది పంజా విసిరిందని, అప్పుడు అతను రాళ్లు విసిరాడని, దీంతో ఆ పులి అతని మెడను నోటకర్చుకొని ఎన్క్లోజర్ లోపలకు పట్టుకు వెళ్లిందని, బారీకేడ్లు తక్కువ ఎత్తులో ఉండటం వల్లే ఇది జరిగిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సరైన రక్షణ ఏర్పాటు లేకపోవడం వల్లనే ఇది జరిగిందని ఆరోపిస్తున్నారు. జూ అధికారులు మాత్రం విమర్శలను కొట్టిపారేస్తున్నారు. తాము హెచ్చరిక బోర్డులు కూడా పెట్టామని చెబుతున్నారు.