మోడీ తర్వాత..ఎవరీ బెన్?: నదిలో దూకి కాపాడారు
గాంధీనగర్: కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా రాజీనామా నేపథ్యంలో.. ఆయన స్థానంలో బిజెపి సీనియర్ నాయకురాలు, సీనియర్ శాసన సభ్యురాలు ఆనందీ బెన్ పటేల్ రానున్నారు. బిజెపి శాసన సభా పక్షం ఆనందీ బెన్ పటేల్ను తమ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకోనున్నారు. మోడీ తర్వాత ఆనందీ ముఖ్యమంత్రి అని తెలియడంతో ఆమె ఎవరు అనే అంశంపై చర్చ సాగుతోంది.
ఆనందీ బెన్ పటేల్ 1941 నవంబర్ 21న జన్మించారు. ఆమె వయస్సు 72. బిజెపిలో ఆమె వివిధ హోదాల్లో, ప్రభుత్వంలో పలు శాఖలను నిర్వహించారు. రాజకీయ ప్రవేశానికి ముందు ఆనందీకి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదు. కోటీశ్వరురాలు కూడా కాదు. అయితే పట్టుదల, ధైర్యం, యోగ్యత.. తదితరాలు ఆమెను గుజరాత్ ముఖ్యమంత్రిగా చేస్తున్నాయి. అభివృద్ధి విషయంలో ఆమెది రాజీపడే తత్వం కాదు.
ఆనందీ రైతు కుటుంబం నుండి వచ్చారు. చదువుకునేందుకు ఆమె ఎన్నో వ్యయప్రయాసలు ఓర్చారు. ఆమె మెహ్సానా జిల్లా బాలికల పాఠశాలలో ఫోర్త్ గ్రేడ్ పూర్తి చేశారు. ఆ తర్వాత బాలికల పాఠశాలలో లేకపోవడంతో మరో పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే... ఏడువందల మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో ఆనందీ ఒక్కరే బాలిక కావడం.
ఎనిమిదో తరగతిలో ఆమె విస్నానగర్లో గల నూతన్ సర్వ్ విద్యాలయలో చేరారు. ఆటల్లో ఆమె అత్యున్నత ప్రతిభకు గాను వీరబాల అవార్డును ఇచ్చారు. 1960లో ఆమె భిల్వాయి కళాశాలలో చేరారు. పెళ్లి అనంతరం ఆమె తన మాస్టర్ డిగ్రీని, బిఈడిని పూర్తి చేశారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులు చదువుకోవాలనే పట్టుదలతో ఆమె ఆ బాధ్యతలు తీసుకున్నారు.
<center><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="NTUxMzMyfHwxMDExfHx8fHx8MTN8fA==";var ven_width="100%";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>
అనుకోకుండా రాజకీయాల్లోకి....
ఆనందీ బెన్ పటేల్ అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చారు. పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేసినప్పుడు ఆమె ధైర్యసాహసాలు ప్రదర్శించారు. ఇద్దరు విద్యార్థులు నర్మదా నదిలో పడినప్పుడు ఆనందీ బెన్ అందులోకి దూకి వారిని రక్షించారు. అప్పుడే బిజెపి దృష్టిలో పడ్డారు. తొలుత పార్టీలో చేరేందుకు ఆమె నిరాకరించారు. అయితే, ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాలు కూడా ఓ మార్గమని భావించిన ఆమె ఆ తర్వాత బిజెపిలో చేరారు.
పలు ప్రజా సంబంధ కార్యక్రమాల ద్వారా ఆమె అంచెలంచెలుగా ఎదిగారు. 1994లో గుజరాత్ నుండి రాజ్యసభకు వచ్చారు. 1998లో ఆమెకు విద్యాశాఖ మంత్రిగా చేసే అవకాశం వచ్చింది. 2002-2012 వరకు ఆమె గుజరాత్ విద్యాశాఖ, రోడ్ అండ్ బిల్డింగ్, రెవెన్యూ శాఖల మంత్రిగా పని చేశారు. 2012లో ఆమెకు మోడీ అర్బన్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ హౌసింగ్ అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ శాఖను ఇచ్చారు. గుజరాత్లో చాలా కాలం ఎమ్మెల్యేగా ఉన్న వారిలో ఆనందీ బెన్ ఒకరు. ఆనందీ బెన్ పటేల్ 1994లో రాజ్యసభ సభ్యురాలు అయ్యారు. ఆ తర్వాత నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.