నేను రాస్తా, నిజాలొస్తాయి: నట్వర్పై సోనియా సీరియస్
న్యూఢిల్లీ: పార్టీ సీనియర్ నేత నట్వర్ సింగ్ వ్యాఖ్యలను ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సీరియస్గా తీసుకున్నారు. తాను ఓ పుస్తకం రాస్తానని, అందులో అన్ని నిజాలు బయటపడతాయని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరో చంపుతారన్న వ్యాఖ్యలకు తాము భయపడటం ఎప్పుడో మానేశామని చెప్పారు.
ఈ వ్యాఖ్యలను తాను సీరియస్గా తీసుకుంటున్నానని, ఓ పుస్తకాన్ని రాస్తానని తెలిపారు. తాను ఈ విషయాన్ని ఆషామాషీగా చెప్పడం లేదన్నారు. నట్వర్ సింగ్ వ్యాఖ్యల పైన కాంగ్రెసు పార్టీ కూడా మండిపడింది. ఓ టీవీ ఇంటర్వ్యూలో నట్వర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రేరణే అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అన్నారు.
నట్వర్ సింగ్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అజయ్ మాకెన్ అన్నారు. రాసిన పుస్తకాల పబ్లిసిటీ కోసం కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మాకెన్ ఆరోపించారు. ఇవి సరికాదన్నారు.
కాగా, సోనియా గాంధీ ప్రధాని కాకుండా 2004లో ఆమె కుమారుడు, ప్రస్తుత కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అడ్డుకున్నారని ఒకప్పటి గాంధీ కుటుంబ విధేయుడు, మాజీ మంత్రి నట్వర్ సింగ్ చెప్పిన విషయం తెలిసిందే. ఉగ్రవాదులు చంపేస్తారనే భయంతో ప్రధాని పదవి చేపట్టవద్దని రాహుల్ గాంధీ సోనియాపై ఒత్తిడి తెచ్చారన్నారు.
‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్' (ఒక జీవితం సరిపోదు) పేరిట నట్వర్సింగ్ తన స్వీయ చరిత్ర రాశారు. ఆ పుస్తకంలోని ఓ అంశాన్ని నట్వర్ సింగ్ ఓ టీవీ చానెల్తో పంచుకున్నారు. ‘అంతర్వాణి' చెప్పినందునే ప్రధాని పదవి స్వీకరించలేదని సోనియా చెప్పడంలో నిజం లేదని, సోనియా ప్రధాని కాకుండా రాహుల్ గాంధీయే అడ్డుకున్నారని నట్వర్సింగ్ తేల్చిచెప్పారు.
నట్వర్ సింగ్ చెప్పిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి - 2004లో యూపీఏ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా ప్రధాని పదవి స్వీకరించాలనే నిర్ణయానికి వచ్చారు. అంతకుముందు సోనియా విదేశీయతపై వివాదం చెలరేగిన సంగతి కూడా తెలిసిందే. దీనిని కూడా లెక్కచేయకుండా ప్రధాని పదవి స్వీకరించేందుకు సోనియా సిద్ధమయ్యారు. కానీ, ఇందుకు రాహుల్ ససేమిరా అన్నారు. ప్రధానమంత్రి అయితే నాన్నమ్మ, నాన్నలాగే సోనియా కూడా చంపే ప్రమాదముందని ఆయన భయపడ్డారన్నారు.
‘అమ్మ ప్రధాని కాకుండా... ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా అడ్డుకుంటాను' అని అప్పట్లో రాహుల్ అన్నారు. తన నిర్ణయం మార్చుకునేందుకు సోనియాకు ఆయన 24 గంటలు డెడ్లైన్ కూడా విధించారు. రాహుల్ పట్టినపట్టు విడవకపోవడంతో సోనియాగాంధీయే వెనక్కి తగ్గారు.
సోనియా, ఆమె కూతురు ప్రియాంక మే 7వ తేదీన తమ ఇంటికి వచ్చారని, ప్రధాని పదవికి సంబంధించిన వివరాలు పుస్తకంలో నుంచి తొలగించాలని కోరారని, గతంలో తన పట్ల వ్యవహరించిన తీరుపట్ల సోనియా విచారం కూడా వ్యక్తం చేశారని, క్షమాపణలు కోరారని నట్వర్ తెలిపారు. ప్రచురితం కావడానికి సోనియా ఇష్టపడని పలు అంశాలు తన పుస్తకం ‘వన్ లైఫ్ ఈజ్ నాట్ ఎనఫ్'లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ పుస్తకం ఆగస్టులో విడుదల కానుంది.
ఇందిర నుంచి సోనియా దాకా ‘గాంధీ' కుటుంబానికి నట్వర్ సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత ఈ బంధం తెగిపోయింది. సద్దాం హుస్సేన్ హయాంలో జరిగిన ‘చమురుకు ఆహారం' కుంభకోణంలో నట్వర్సింగ్తోపాటు ఆయన కుమారుడు కూడా లబ్ధి పొందినట్లు వోల్కర్ నివేదిక అప్పట్లో స్పష్టం చేసింది.
దీంతో తనకు సంబంధంలేదని నట్వర్ చెప్పినా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు. 2008లో ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. దీంతో నట్వర్సింగ్, ఆయన కుమారుడు జగత్ బీఎస్పీలో చేరారు. ప్రస్తుతం నట్వర్ కుమారుడు రాజస్థాన్లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తనను అవమానకరమైన పద్ధతిలో కాంగ్రెస్ నుంచి పంపించేశారని నట్వర్సింగ్ పలు సందర్భాల్లో తన ఆక్రోశం వ్యక్తం చేశారు.