వివస్త్రను చేసి మహిళను ఊరేగించి, స్తంభానికి కట్టేశారు
భువనేశ్వర్: ఒడిషా రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ 60 ఏళ్ల మహిళను విపరీతంగా కొట్టి, ఆ తర్వాత వివస్త్రను చేసి, నగ్నంగా ఊరేగించారు. వశీకరణ చేస్తుందనే అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు సోమవారంనాడు చెప్పారు.
భువనేశ్వర్కు 300 కిలోమీటర్ల దూరంలో గల జోదపొఖారి గ్రామంలో ఆదివారంనాడు జరిగింది. వివస్త్రను చేసి, ఓ స్తంభానికి నగ్నంగా కట్టేసిన 12 గంటల తర్వాత పోలీసులు మహిళకు విముక్తి కలిగించారు.
మలేరియా వ్యాధితో 18 ఏళ్ల యువకుడు ప్రభుత్వాస్పత్రిలో ఈ నెల 23వ తేదీన మరణించాడని, వశీకరణ మంత్రం వల్లనే అతను చనిపోయాడని అంటూ అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారని జిల్లా అదనపు పోలీసు సూపరింటిండెంట్ జిసి మల్లిక్ చెప్పారు.
మంత్రాలు చేయడం వల్లనే అతనికి తిరిగి ప్రాణం పోయాలని ఇతర గ్రామస్తులతో పాటు మరో ముగ్గురు మహిళలను కుటుంబ సభ్యులు అడిగారని, ఆచారాలు నిర్వహిస్తుండగా ఓ మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయిందని, దాంతో ఆమెనే అతన్ని చంపిందని ఆరోపిస్తూ వివస్త్రను చేసి నగ్నంగా స్తంభానికి కట్టేశారని ఆయన వివరించారు.
మహిళ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, తన 32 ఏళ్ల వృత్తిలో మంత్రవిద్యకు సంబంధించిన ఇంతటి దారుణాన్ని చూడలేదని ఆయన అన్నారు. యువకుడి మృతదేహానికి అంత్యక్రియలు చేయడానికి నిరాకరించడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామంలో వందకు పైగా సాయుధ పోలీసులను దించారు.