జీపులో తిప్పుతూ స్త్రీపై గ్యాంగ్రేప్: విద్యార్థిని సూసైడ్
బరేలి/విజయవాడ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దారుణాలు ఆగడం లేదు. లిఫ్టు అడిగి జీపులో ఎక్కిన ఓ మహిళ(28)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి జిల్లాలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బరదారి పోలీస్స్టేషన్ పరిధి ఫిలిబిత్ బైపాస్ సమీపంలోని బస్టాప్ వద్ద వేచివున్న బాధిత మహిళ అటుగా వెళుతున్న జీపును లిఫ్టు అడిగింది. ఆమెను ఎక్కించుకున్న తర్వాత జీపులోని నలుగురు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను రోడ్డు పక్కన పడేసి పారిపోయారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ రాజీవ్ మెహ్రోత్రా తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
పాఠశాలపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడ: నగరంలోని కరెన్సీ నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక రవీంద్ర భారతీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న భార్గవి అనే విద్యార్థిని అదే పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. యాజమాన్యం ఒత్తిడి కారణంగానే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు, స్థానికులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు.