పాఠశాలలో మహిళ మృతదేహం: రేప్ చేసి హత్య?
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను హత్య చేసి జెపినగర్లోని యెలచినహళ్లిలోని ప్రభుత్వ పాఠశాలలో కాల్చివేశారు. పాక్షికంగా కాలిన ఆమె మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసుకున్నారు.
మృతురాలిది అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న జయమ్మ(53)గా గుర్తించారు. మృతదేహంపై పలు గాయాలుండటంతో ఆమెను మొదట అత్యాచారం చేసిన దుండగులు.. ఆమెను హత్య చేసి పాఠశాల ఆవరణలో కాల్చివేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అత్యాచారం జరిగింది లేనిది తెలుస్తుందని పోలీసులు తెలిపారు.
మృతురాలికి నలుగురు పిల్లలు ఉన్నారని పోలీసులు చెప్పారు. ఆమె పాచి పని చేస్తూ జీవనం సాగిస్తోందని తెలిపారు. ఆమెకు మద్యం కూడా అలవాటుందని చెప్పారు. ఆదివారం రాత్రి మళ్లీ వస్తానని ఇంటి నుంచి బయటికివెళ్లిన జయమ్మ.. మళ్లీ తిరిగిరాలేదు.
సోమవారం బ్యాడ్మింటన్ ఆడేందుకు సోమవారం ఉదయం పలువురు బాలురు పాఠశాలకు వెళ్లగా అక్కడ ఆమె మృతదేహం పడివుంది. దీంతో ఆందోళన చెందిన బాలురు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతురాలి తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.