భర్త సచివాలయ ఉద్యోగి, రైల్వే గేట్ కీపర్గా స్త్రీ(ఫోటో)
చెన్నై: తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో నలుగురు మహిళలు రైల్వే గేట్ కీపర్లుగా పని చేస్తున్నారు. సాధారణంగా చాలామంది రైల్వే గేట్ కీపర్ పని చాలా కష్టమైనదిగా భావిస్తారు. ఇలాంటి ఉద్యోగంలో నలుగురు మహిళలు చేరారు. వారు మూడు నెలల క్రితం జాయిన్ అయ్యారు.
ఇన్ని రోజుల సమయంలో ఆ మహిళలు పురుషులకు తీసిపోని విధంగా తమ పనితనాన్ని చాటారు. మరో ఎనిమిది మంది నాగర్కోయిల్లో ట్రాక్ నిర్వహణ పనులు, చెకింగ్ సెక్షన్లలో పని చేస్తున్నారు.
కేవీ విజయలక్ష్మి అనే మహిళ బీకామ్ ఫస్ట్ క్లాస్లో పాసయ్యారు. ఈమెది తిరువనంతపురానికి దగ్గర్లోని చిరయింజీజు గ్రామం. ఈమె రైల్వే పరీక్షలు రాసి ఇంజనీరింగ్ ట్రాఫిక్ సర్వీస్లో గేట్ కీపర్గా ఉద్యోగంలో చేరారు. కేవీ విజయలక్ష్మితో పాటు మరో నలుగురు గేట్ కీపర్ ఉద్యోగంలో చేరారు.
వీరు త్రివేంద్రం రైల్వే ఇనిస్టిట్యూట్లో నెల రోజుల పాటు శిక్షణ పొందారు. అనంతరం ఉద్యోగంలో చేరారు. వీరి త్రివేండ్రం డివిజన్ నాగర్కోయిల్ సెక్షన్లో జాయిన్ అయ్యారు. మరో మహిళ కూడా ఉద్యోగానికి సెలక్ట్ అయినప్పటికీ ఆమె శిక్షణ కాలం తర్వాత మెడికల్ లీవ్ పైన వెళ్లారు.
కేవీ విజయలక్ష్మి సుచింద్రం స్టేషన్ వద్ద గేట్ కీపర్గా పని చేస్తున్నారు. ఈ ఉద్యోగం కష్టంగా ఏమీ లేదని, తాను ఇష్టపూర్వకంగానే చేరానని తెలిపారు. ఈ నలుగురు మహిళలకు కూడా ఎక్కువ జనసమ్మర్దం ఉండే రైల్వే గేట్ల వద్దనే పోస్టింగ్ ఇచ్చారు. వీరు కేవలం పగటి పూట మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. రాత్రిపూట పురుషులు విధులు నిర్వహిస్తారు.
కేవీ విజయలక్ష్మి ఓ లారీ డ్రైవర్ కూతురు. ఈమె తిరువనంతపురంలోని కేరళ సచివాలయంలో సీనియర్ కంప్యూటర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ప్రవీణ్ను వివాహం చేసుకున్నారు. ఈ ఉద్యోగంలో చేరేందుకు తన అత్తామామలు, తల్లిదండ్రులు ప్రోత్సహించారని ఆమె చెబుతున్నారు. కాగా, ఆమెతో పాటు గేట్ కీపర్ ఉద్యోగాలకు ఎంపికైన వారిలో జయసుమి అరాటు వద్ద, పులారి పులియాది వద్ద, జీఎస్ నిషా బలమోర్ వద్ద విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా కూడా నాగర్కోయిల్ రైల్వే క్వార్టర్లలో ఉంటున్నారు.