తప్పు చేస్తే ఊరితీయండి: గోద్రాపై మోడీ, క్షమాపణకు నో
అహ్మదాబాద్: 2002లో జరిగిన గోద్రా అల్లర్లకు క్షమాపణ చెప్పడానికి మరోసారి నిరాకరించిన నరేంద్ర మోడీ ఈ అల్లర్లకు సంబంధంచి తనపై చేస్తున్న ఆరోపణల్లో ఇసుమంత నిజమున్నా తనను బహిరంగంగా ఉరి తీయాలని అన్నారు. వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన గోద్రా అనంతర అల్లర్లకు గాను మోడీ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ల గురించి అడగ్గా, క్షమాపణ చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.
ఎందుకంటే అలాంటి ఆరోపణల విషయంలో అది సరైన మార్గం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆ ఆరోపణల్లో ఇసుమంత నిజమున్నా భారత దేశ ఉజ్వల భవిష్యత్తు సంప్రదాయాల కోసం మోడీని నాలుగు వీధుల కూడలిలో బహిరంగంగా ఉరి తీయాలని తాను భావిస్తున్నానని అన్నారు.
ఎందుకంటే మరో వందేళ్ల దాకా అలాంటి దారుణమైన నేరానికి ఎవరూ పాల్పడకుండా ఉండడానికి అంత తీవ్రమైన శిక్ష ఉండాలని తాను అనుకుంటున్నానట్లు చెప్పారు.
'మోడీ గనుక నేరం చేసి ఉంటే ఆయనను క్షమించకూడదు. క్షమాపణ ద్వారా జనాన్ని క్షమించే ఈ సంప్రదాయం ఏమిటి? క్షమాపణ అనేది ఉండకూడదు. మోడీని ఎప్పటికీ క్షమించకూడదు' అని ఎఎన్ఐ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ అన్నారు.