కలకలం: ఎమ్మెల్యే ఇంట్లో యువకుడి మృతదేహం
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పృథ్వీపూర్ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అనితా నాయక్ నివాసంలో లభ్యమైన ఓ యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఎమ్మెల్యే నివాసంలో శుక్రవారం ఓ యువకుడి మృతదేహం అనుమానాస్పద రీతిలో లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
మృతుడ్ని మనోజ్ ధిమార్(24)గా గుర్తించారు. ఆ యువకుడు జతరా పట్టణంలోని ఎమ్మెల్యే ఇంటికి తరచూ వస్తూ ఉండేవాడని జతరా పోలీసు అధికారి(ఎస్డిఓపి) ఎన్కె పరిహార్ తెలిపారు.
మనోజ్ చెట్టు మీది నుంచి పడి మృతి చెందినట్లు ఎమ్మెల్యే కుటుంబీకులు చెప్పినట్లు పోలీసులు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపామని, వివరాలు అందిన అనంతరం విచారణ చేస్తామని పోలీసులు తెలిపారు.
మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని, అతని వెనుకవైపు కర్రతో కొట్టినట్లు అచ్చులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు.