మేం కాదు: నరేంద్ర మోడీకి వీసా నిరాకరణపై జాన్ కెర్రీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీకి వీసా నిరాకరించింది వేరే ప్రభుత్వమని, తమ ప్రభుత్వం ఆయనకు రెడ్ కార్పెట్ పరుస్తుందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ గురువారం అన్నారు. మోడీకి సాదర స్వాగతంలో పాటు వీసాను ఇస్తామన్నారు. భారత్లో పర్యటిస్తున్న ఆయన గురువారం ఆ దేశ వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ ప్రిట్జర్తో కలిసి ఓ న్యూస్ చానెల్తో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం లభించే దిశగా తమవంతు సహకారం అందిస్తామన్నారు. న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత్కు చోటు దక్కే విషయంలోనూ సహకరిస్తామన్నారు. భారత్తో కలిసి ముందడుగు వేసేందుకే తమ ప్రభుత్వం నిశ్చయించిందని స్పష్టం చేశారు. బీజేపీ నేతల ఇళ్లపై అమెరికా నిఘా పెట్టిన అంశంపై స్పందించిన ఆయన, గూఢచర్యానికి సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని అమెరికా విధానమన్నారు.
ఉగ్రవాదం విషయంలో మాత్రం ఇరుదేశాలు స్పష్టమైన ప్రకటన చేశాయి. ముంబై దాడులకు కారణమైన వారిని శిక్షించాలని పాక్ను భారత్, అమెరికా డిమాండ్ చేశాయి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులపై జాన్ కెర్రీ స్పష్టమైన సమాధానమిచ్చారు. తన భూభాగంపై దాడులు జరుగుతూ ఉంటే, ఏ దేశం కూడా చూస్తూ ఊరుకోదని ఇజ్రాయెల్ను సమర్థించారు.
అంతర్జాతీయంగా ఉగ్రవాద సంస్థగా ముద్రపడిన ఓ సంస్థ (హమాస్), ఓ దేశంపై రాకెట్ దాడులకు పాల్పడుతోందన్నారు. మరి ఇజ్రాయెల్ చూస్తూ ఎలా ఊరుకుంటుదని ప్రశ్నించారు. భారత్ మాత్రం పాలస్తీనా ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చెబుతూనే.. ఇజ్రాయెల్ తమకు మిత్రదేశమని చెప్పింది.