సరిహద్దుపై చైనా అధ్యక్షుడు జిన్పింగ్, హైస్పీడ్ రైళ్లపై..
న్యూఢిల్లీ: భారత్, చైనాలు ఒకరికి మరొకటి ముఖ్యమైన పొరుగు దేశాలని చైనా అధ్యక్షులు జీ జిన్పింగ్ గురువారం అన్నారు. సరిహద్దు విషయంలో కొన్ని పరిష్కరించుకోవాల్సినవి ఉన్నాయని, ఆ కారణంగానే సరిహద్దులో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఇవి సాధ్యమైనంత త్వరగా సెటిల్ చేసుకోవాలల్సి ఉందన్నారు.
భారత్ - చైనాల మధ్య మొత్తం 12 కీలక ఒప్పందాల పైన అవగాహన కుదిరింది. హైదరాబాద్ హౌస్లో చైనా అధ్యక్షులు జీ జిన్పింగ్, ప్రధాని మోడీ భేటీ అయిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
భారత్ గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు ఉన్న దేశమని జిన్పింగ్ అన్నారు. అన్ని అంశాల పైన చర్చలు ఫలవంతంగా జరిగాయన్నారు. వ్యూహాత్మక సంబంధాల పైన స్పష్టమైన అవగాహనతో పని చేయాలని తాము నిర్ణయించామని తెలిపారు. భారత్కు హైస్పీడ్ రైళ్ల అభివృద్ధికి చైనా సహకరిస్తుందని తెలిపారు.
సాధ్యమైనంత త్వరగా నరేంద్ర మోడీని చైనాకు రావాలని తాను కోరానని తెలిపారు. చైనా, భారత్లు అభివృద్ధి చెందుతున్న దేశాలే కాకుండా విస్తృత అవకాశాలు ఉన్న దేశాలని అన్నారు. ఇరుదేశాల ప్రజల మెరుగు కోసం పర్యాటకం, విద్యా రంగాల్లో పరస్పరం సహకరించుకుంటామన్నారు.
భారత్ - చైనా - మయన్మార్ - బంగ్లాదేశ్ వాణిజ్య కారిడార్ పైన చర్చించామని తెలిపారు. షాంఘై కో ఆపరేషన్ సమితిలో భారత్కు సభ్యత్వం ఇస్తామని తెలిపారు. గుజరాత్లో విద్యుత్ ఉత్పాదక, పంపిణీ ఉపకరణాల పారిశ్రామిక కేంద్రం, మహారాష్ట్రలో ఆటో వాహన తయారీ విడిభాగాల తయారీ పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.