ఫోటో: భారత్-చైనా మధ్య 12ఒప్పందాలు, టిబెట్ సెగ
న్యూఢిల్లీ: చైనా - భారత దేశాల మధ్య మొత్తం 12 ఒప్పందాల పైన అవగాహన కుదిరింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో చైనా అధ్యక్షులు జీ జిన్పింగ్, ప్రధాని నరేంద్ర మోడీలు దాదాపు 45 నిమిషాలు పలు అంశాల పైన చర్చించారు. అనంతరం వారు ఉమ్మడిగా మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత్ - చైనాల మధ్య 12 ఒప్పందాల పైన అంగీకార కుదిరింది. సమాచార, రైల్వే, ఆర్థిక, వాణిజ్యం, మానస సరోవర్ రహదారి నిర్మాణం తదితరాల పైన ఒప్పందం కుదిరింది.
భారత్ - చైనా మధ్య సమాచార శాఖ మధ్య, రైల్వేల అభివృద్ధి పైన, మానస సరోవర్ నిర్మాణం పైన, షాంఘై - ముంబై నగరాల అభివృద్ధి తదితరాల పైన ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య ఐదేళ్ల పాటు వాణిజ్య ఒప్పందం కుదిరింది.
చైనా అధ్యక్షుడికి టిబెటన్ల నిరసన
టిబెట్ పై చైనా తీరును నిరసిస్తూ టిబెటన్లు నిరసన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీతో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో సమావేశమైన నేపథ్యంలో టిబెట్ ఆందోళనకారులు తమ నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ హౌస్ మూడవ నెంబర్ గేట్ వద్దకు చేరుకుని చైనా వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో, పోలీసులు వారిని ఆడ్డుకున్నారు. ఆందోళనకారులు ఎదురు తిరగడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. చైనా పాలన నుంచి టిబెట్కు విముక్తి కలిగించాలని నినాదాలు చేశారు.