పీకకోసిన మిలిటెంట్లు: జర్నలిస్ట్ రెండో వీడియో విడుదల
లండన్: ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు (ఐఎస్) తమ వద్ద బందీగా ఉన్న బ్రిటీష్ జర్నలిస్టు జాన్ కాంట్లీ సందేశంతో ఉన్న రెండో వీడియోను విడుదల చేశారు. మిలిటెంట్లు అతని తొలి వీడియోను విడుదల చేసిన వారం రోజుల్లోపు రెండో వీడియోను విడుదల చేశారు.
అమెరికా, దాని మిత్ర దేశాలు మూడో గల్ఫ్ యుద్ధానికి పాల్పడుతున్నాయని, వియత్నాం యుద్ధం తర్వాత అంత తీవ్రమైన గందరగోళం మరోసారి ఎదురుకాబోయే ప్రమాదం ఉందని వీడియోలో హెచ్చరించాడు.
ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లతో పోరాడడానికి 15 వేల మంది సైనికులు అవసరమన్న ప్రస్తుత అంచనా పూర్తి హాస్యాస్పదంగా ఉందని, ఎందుకంటే ఈ ఇస్లామిక్ స్టేట్ సంస్థలో అంతకన్నా ఎక్కువ మందే ముజాహిదీన్లు ఉన్నారని, అంతేకాదు ఇది పదుల సంఖ్యలో కలష్నికోవ్లు మాత్రమే కలిగిన అవ్యవస్థీకృత సంస్థ కాదని కాంట్లీ ఆ వీడియోలో అన్నాడు.
ఆ వీడియోలో కాంట్లీ ఆరంజ్ రంగు దుస్తులు ధరించి ఉండగా వెనుక వైపు న్యూయార్క్ టైమ్స్ పత్రిక క్లిప్పింగ్స్ కనిపిస్తున్నాయి. 43 ఏళ్ల ఫ్రీలాన్స్ ఫోటో జర్నలిస్టు అయిన కాంట్లీ ఆ వీడియోలో తనను బ్రిటీష్ ప్రభుత్వం వదిలేసిన, ఇస్లామిక్ స్టేట్ సంస్థ చేతిలో దీర్ఘకాలంగా బందీగా ఉన్న బ్రిటీష్ పౌరుడిగా పరిచయం చేసుకున్నాడు.
లెండ్మి యువర్ ఇయర్స్, మెస్సేజెస్ ఫ్రమ్ ది బ్రిటీష్ డిటైనీ జాన్ కాంట్లీ పేరుతో ఇంతకు ముందు విడుదల చేసిన వీడియో తరహాలోనే ఈ వీడియో కూడా ఉంది. ఇస్లామిక్ స్టేట్ మూవ్మెంట్ను అత్యంత శక్తివంతమైన జిహాదీ మూవ్మెంట్గా అభివర్ణించిన కాంట్లీ అమెరికా కూటమి దానికి ఎలాంటి హానీ చేయలేదన్నాడు.