పాక్లో ఉద్రిక్తం: చావడానికైనా సిద్ధమని ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్పై హత్యాయత్న కేసును పెట్టనున్నట్లు తెహ్రీక్ ఇన్సాఫ్ ఇ పార్టీ చీఫ్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అమాయకుల ప్రాణాలు పోవడానికి కారకుడైన నవాజ్ షరీఫ్ పైన హత్యాతయ్నం కేసు పెడతానన్నారు. తాను చావడానికైనా సిద్ధమే కానీ పట్టు మాత్రం వీడేది లేదన్నారు.
అమాయ ప్రజలపై పోలీసుల చర్యను ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. నవాజ్ షరీఫ్ రాజీనామా చేసే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తమ హక్కు అన్నారు. కాగా, ప్రధాని రాజీనామా చేయాలంటూ పాకిస్తాన్లోని ఇస్లామాబాదులో ఖాద్రీ, ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
ఆందోళనకారులు ప్రధాని నివాసం వైపు దూసుకు పోవడంతో భద్రతా సిబ్బంది బాష్పవాయు గోళాలను ప్రయోగించింది. దీంతో పలువురు గాయపడ్డారు. ప్రధాని నివాసం వైపు చొచ్చుకు పోతునన నిరసనకారులను అడ్డుకునేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించింది. వందలాది మంది గాయపడినట్లుగా తెలుస్తోంది.
గత ఎన్నికల్లో రిగ్గింగ్ వంటి అక్రమాలకు పాల్పడి అధికారంలోకి వచ్చిన నవాజ్ షరీఫ్.. తక్షణం తన పదవికి రాజీనామా చేయాలంటూ ఇమ్రాన్తోపాటు ఖాద్రి మద్దతుదారులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే.
ముఖ్యంగా శనివారం రాత్రి ఆందోళనకారులు నవాజ్ షరీఫ్ ఇంటి ముట్టడికి యత్నించడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు లాఠీచార్జ్, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో పాకిస్తాన్లో ఉద్రిక్తంగా ఉంది. మీడియా పైన ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మరోవైపు నవాజ్ షరీఫ్ ఇస్లామాబాదుకు తిరిగి వచ్చారు.