తనతో విడిపోయిందని మాజీ ప్రియురాలి మంచానికి నిప్పుపెట్టాడు
దుబాయ్: తన నుంచి విడిపోయిందనే అక్కసుతో మాజీ ప్రియురాలి మంచానికి నిప్పుపెట్టాడు ఓ ప్రవాస భారతీయుడు. అక్కడితో ఆగకుండా ఆమె బూట్లను కాల్చి బూడిదచేశాడు. గత సంవత్సరం అక్టోబర్లో జరిగిన ఈ ఘటనలో నిందితుడి(26)పై అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. జుమీరాహ్ పామ్ ప్రాంతంలోని ఓ హోటల్లో వెయిటర్గా పని చేస్తున్నాడు. అదే హోటల్లో బాధిత యువతి కూడా రిసెప్షనిస్టుగా పని చేస్తోంది. ఈ ఇద్దరు గతంలో కొంతకాలం ప్రేమాయణం నడిపించారు. అయితే విభేదాల కారణంగా ఆ యువతి అతడ్ని దూరం పెట్టడం ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో ఆమెపై కోపం పెంచుకున్న నిందితుడు మద్యం సేవించి రాత్రిపూట తన ప్రియురాలు నివాసానికి వెళ్లాడు. ఆ తర్వాత ఆమె పడుకున్న మంచానికి నిప్పుపెట్టాడు. ఆమె బూట్లకు కూడా నిప్పుపెట్టి కాల్చివేశాడు. అయితే బాధితురాలు అప్రమత్తం కావడంతో ఆమెకు పెద్ద ప్రమాదం తప్పింది. అయితే గదిలోని విలువైన సామాగ్రి మొత్తం కాలిబూడిదైంది.
బాధితురాలి ఫిర్యాదు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టారు. కాగా, మద్యం మత్తులో ఉన్న తాను ఏం చేశానో తెలియదని, నిప్పు పెట్టిన విషయం కూడా తనకు గుర్తు లేదని నిందితుడు కోర్టులో తెలిపాడు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది.