వీడనున్న ఎంహెచ్370 మిస్టరీ: 58వస్తువుల గుర్తింపు!
కౌలాలంపూర్: ఆరు నెలల క్రితం అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 గాలింపులో ఓ ముందడుగు పడినట్లు కనిపిస్తోంది. మలేషియా విమానం ఎంహెచ్ 370కి సంబంధించినవిగా భావిస్తున్న 58 దృఢ వస్తువులను హిందూ మహాసముద్రంలో గుర్తించినట్లు ఆస్ట్రేలియా నేతృత్వంలో గాలింపు చేపడుతున్న ఓ బృందం వెల్లడించింది.
విమానానికి సంబంధించిన శకలాలుగా భావిస్తున్న వస్తువులని జాయింట్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్(జెఏసిసి) పరిశీలిస్తోందని మలేషియా రవాణా శాఖ మంత్రి లియో టియాంగ్ లై మీడియాకు తెలిపారు. ప్రస్తుతం తాము 58 దృఢమైన వస్తువులను గుర్తించామని, అయితే అవి ఎంహెచ్ 370 విమానానివేనా? లేక సముద్రం అడుగున ఉన్న రాళ్లా అన్న విషయంపై అధ్యయనం జరగాల్సి ఉందని తెలిపారు.
అందుకుగాను చమురు అన్వేషణలో ఉపయోగించే గో ఫినిక్స్ నౌక సహాయంతో మలేషియాకు చెందిన పెట్రోనాట్స్ దక్షిణ హిందూ మహాసముద్రంలో మోహరించి పరిశీలన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇది సెప్టెంబర్ 21 నాటికి పెర్త్ చేరుకుంటుందని ఆయన తెలిపారు.
ఈ ఏడాది మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతయిన విషయం తెలిసిందే. కౌలాలంపూర్ నుండి బీజింగ్కు వెళ్తున్న ఈ విమానంలో 239 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఇందులో ఐదుగురు భారతీయులు ఉన్నారు. క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. ఆ తరవాత ఎంహెచ్ 17 ప్రమాదంలో 298 మంది చనిపోయారు.