ఐఎస్ఐఎస్ను తక్కువగా అంచనా వేశామన్న ఒబామా
న్యూఢిల్లీ: ఇరాక్, సిరియాల్లో పెద్ద ఎత్తున హింసకు పాల్పడుతున్న జిహాది మిలిటెంట్లు (ఐఎస్ఐఎస్) శక్తి సామర్ద్యాలను తక్కువగా అంచనా వేశామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒప్పుకున్నారు.
చివరి దశలో ఉన్న సిరియా, జిహాదీ తీవ్రవాదులు ఏకమయ్యేందుకు స్థావరంగా మారుతుందని అంచనా వేయలేకపోయామని ఆదివారం సీబీఎస్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
భూమిపై జిహాది మిలిటెంట్లకు స్దావరమే లేకుండా చేసేందుకు సంకీర్ణ సైన్యాలతో కలిసి వైమానికి దాడులు జరుపుతున్నామని అన్నారు. అమెరికా శిక్షణలో తయారైన ఇరాకీ బలగాలు తీవ్రవాదులను అణచివేయడంలో విజయం సాధిస్తాయని కూడా తాము అంచనా వేశామని, ఐతే దానికి భిన్నంగా జరిగిందని ఒబామా పేర్కొన్నారు.
ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్న పలు చమురు శుద్ది కర్మాగారాలపై అమెరికా వైమానికి దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఐఎస్ ఆధీనంలో ఉన్న సిరియాలో అతి పెద్దదైన కోనెకో గ్యాస్ ప్లాంట్పై ఆదివారం దాడి చేశారు.