ద. కొరియాలో భారీ దుర్ఘటన: 459మందితో ఓడ మునక
సియోల్: దక్షిణ కొరియా భారీ దుర్ఘటన జరిగింది. దక్షిణ తీరంలో బుధవారం ఈ దుర్ఘటన సంభవించింది. విహార యాత్ర కోసం 459 మందిని తీసుకుని ఒక దీవికి బయలుదేరిన ఫెర్రీ ఓడ సముద్ర జలాల్లో మునిగిపోవడంతో ఆరుగురు మృతి చెందగా, దాదాపు 290 మంది గల్లంతయ్యారు.
ఇందులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది హైస్కూలు విద్యార్థులే. వీరి కోసం పెద్ద సంఖ్యలో నౌకలను, హెలికాప్టర్లను రంగంలోకి దింపి ముమ్మరంగా సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకూ ఆరుగురు మృతి చెందారని, మరో 55 మంది గాయపడ్డారని అధికారులు ధృవీకరించారు.
మునిగిపోయిన పడవలో మరింత మంది చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నందున మృతుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. దక్షిణ కొరియాలో 1993లో జరిగిన ఫెర్రీ ప్రమాదంలో 292 మంది మృతిచెందారు. దీని తర్వాత దక్షిణ కొరియాలో జరిగిన అతిపెద్ద ఫెర్రీ ప్రమాదం ఇదే.
తాము ప్రయాణిస్తున్న పడవ తీవ్రమైన కుదుపులకు లోనై ఒకవైపుకు ఒరిగిపోనారంభించడంతో లైఫ్ జాకెట్లు ధరించి ఒకరి తర్వాత మరొకరుగా సముద్రంలోకి దూకేశామని, అక్కడి నుంచి ఈదుకుంటూ వచ్చి సమీపంలోని లైఫ్ బోట్లోకి చేరుకున్నామని లిమ్ హ్యుంగ్-మిన్ అనే విద్యార్థి వైటిఎన్ వార్తా సంస్థకు వివరించాడు.
కాగా, ప్రమాదానికి గురైన ఫెర్రీ మెల్లగా నీటిలో మునిగిపోతున్న దృశ్యాలను, అందులో నుంచి సముద్రంలోకి దూకేసిన వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షిస్తున్న దృశ్యాలను స్థానిక టెలివిజన్ చానళ్లు ప్రత్యక్షంగా ప్రసారం చేశాయి. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ప్రస్తుతం 87 నౌకలు, మరో 18 ఎయిర్క్రాఫ్ట్లతో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ దుర్ఘటనపై దక్షిణ కొరియా పాలన, భద్రత ఉపమంత్రి లిగ్యోంగాగ్ మాట్లాడుతూ... మునిగిపోయిన ఓడలో ముప్పై మంది సిబ్బంది, 325 మంది విద్యార్థులు, 15 మంది ఉపాధ్యాయులు, 89 మంది ఇతర ప్రయాణీకులు ఉన్నారని తెలిపారు.