స్వైరవిహారం: కుర్రాడు 21 మందిని కత్తితో పొడిచేశాడు
పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని మరీస్ విల్లే ప్రాంతంలో బీభత్సకరమైన సంఘటన జరిగింది. ఓ విద్యార్థి తోటి విద్యార్థులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 21 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
పదో తరగతి చదివే కుర్రాడు (16) రెండు చేతుల్లో రెండు చురకత్తులు పట్టుకుని పాఠశాలలో స్వైర విహారం చేశాడు. కనిపించినవారిని కనిపించినట్లు, తన దారికి అడ్డొచ్చిన వారిని విచక్షణ రహితంగా పొడిచేశాడు. చేతిలోని కత్తులు దూస్తూ ఉన్మాదిలా ప్రవర్తించాడు. అరగంటపాటు విచ్చలవిడిగా సాగిన అతడి దాడిలో 19 మంది విద్యార్థులు, ఒక సెక్యూరిటీ గార్డు తీవ్రంగా గాయపడ్డారు.
ఎటు చూసినా నెత్తుడి మరకలు కనిపించాయి. భయంతో వణికిపోతున్న విద్యార్థుల ఆర్తనాదాలతో బడి ప్రాంగణమంతా భయానకంగా తయారైంది. బుధవారం ఉదయాన్నే 7.13 నుంచి 7.45 దాకా పిట్స్బర్గ్లోని ముర్రీస్ విల్లేలోని ఫ్రాంక్లిన్ రీజనల్ హైస్కూల్లో ఈ దారుణం జరిగింది. ఇంత ఘోరానికి పాల్పడిన నిందితుణ్ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తొలుత కొద్దిసేపు అతణ్ని స్కూల్లోనే ప్రశ్నించి అతడి చేతికి కూడా గాయమైనందున ఉదయం 10 గంటల సమయంలో ఆస్పత్రికి తరలించారు. ఈ దాడిలో గాయపడినవారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రులకు చికిత్స నిమిత్త తరలించారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.