కాశ్మీర్ భారత్లో భాగం కాదు: అస్లాం, తెగబడ్డ పాక్
అబ్దుల్ బాసిత్ కాశ్మీర్ వేర్పాటు వాదులతో మాట్లాడడం భారతదేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం కాదని ఆమె వ్యాఖ్యానించారు. భారతదేశానికి పాక్ తాబేదారు కాదని, సర్వసత్తాక దేశమని, జమ్ము-కాశ్మీర్ వివాదంలో ఒక చట్టబద్ధమైన భాగస్వామి అని చెప్పారు. చర్చల విరమణకు భారత్ చెబుతున్న ఈ కారణం ఒక సాకు మాత్రమేనని, తాము హురియత్ నేతలతో చర్చలు జరపడం ఇదే మొదటిసారి కాదని అస్లాం అన్నారు.
అదొక వివాదాస్పద భూభాగమని, దానిపై ఐక్యరాజ్యసమితి చేసిన పలు తీర్మానాలున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. కాశ్మీర్ అంశం ఎంత మాత్రం భారత అంతర్గత సమస్య కాదని, అది ముమ్మాటికీ అంతర్జాతీయ సమస్యేనని వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ తేల్చిచెప్పారు. భారత్లో పాక్ రాయబారి అబ్దుల్ బాసిత్తో భేటీ అయ్యేందుకు మంగళవారం ఆయన న్యూఢిల్లీ వచ్చారు.
భారత్ తీసుకున్న చర్చల రద్దు నిర్ణయం దురదృష్టకరమన్నారు. కాశ్మీర్ అంశం తమ అంతర్గత విషయమని భారత్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చూపేందుకు ఆసక్తి చూపని భారత్ ఆ సమస్యను మరింత జటిలం చేస్తోందని గిలానీ ఆరోపించారు. శాంతియుత, రాజకీయ తీర్మానంతోనే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించగలదని హురియత్ కాన్ఫరెన్స్ నేత మిర్వైజ్ ఉమర్ ఫరూఖ్ వ్యాఖ్యానించారు. జమ్ము కాశ్మీర్ అధికార, ప్రతిపక్షాలైన నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ నేతలు కూడా కేంద్రంపై విమర్శలు కురిపించారు.
ఈ పరిణామాలపై అగ్రదేశం అమెరికా ఆచితూచి స్పందించింది. అటూ ఇటూ నెలకొన్న పరిస్థితిని దురదృష్ణకరంగా అభివర్ణించింది. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు భారత్-పాక్ చేసే ప్రయత్నాలకు ఎప్పటిలాగే మా మద్దతు కొనసాగుతుందని ఒక ప్రకటనలో తెలిపింది.