గాజా పరిస్థితిపై కన్నీటిపర్యంతమైన యున్ అధికారి
గాజా: గాజా పరిస్థితిపై స్పందిస్తూ ఓ ఐక్యరాజ్య సమితి అధికారి కన్నీటి పర్యాంతమయ్యాడు. బుధవారం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పని చేస్తున్న ఒక పాఠశాల షెల్టర్ హోంపై ఇజ్రాయెల్ దాడికి పాల్పడగా 15 మంది మరణించారు. వందమందికిపైగా విద్యార్థులు గాయాలపాలయ్యారు. ఈ అంశంపై ఓ టెలివిజన్ ఛానల్తో మాట్లాడుతూ.. అక్కడి ఐక్యరాజ్య సమితి ప్రతినిధి క్రిస్ గన్నెల్ ఉద్వేగానికి గురై కన్నీటి పర్యాంతమయ్యారు.
తీవ్ర ఉద్వేగానికి గురికావడంతో అతను మాట్లాడలేకపోయారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రకటతన విడుదల చేశారు. మృతుల సంఖ్యను ఒక గణాంకంలా యథాలాపంగా చూడవద్దని, ఒక్కో అంకె రక్త మాంసాలు, హృదయం, ఆశలు, ఆశయాలు ఉండే ఒక మనిషని గుర్తుంచుకోవాలని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.
దీనిపై ఇజ్రాయెల్ స్పందిస్తూ.. క్రిస్ గన్నెల్ ఇజ్రాయెల్ వ్యతిరేక భావనలతో ఉన్నారని, ఆయనను వెంటనే సస్పెండ్ చేయాలని ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. కాగా, పసి పిల్లలపై దాడికి పాల్పడిన ఇజ్రాయెల్పై ఐక్యరాజ్య సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
జులై 8న ఇజ్రాయెల్, హమాస్ మధ్య పోరు ప్రారంభమైనప్పటి నుంచి గత 23 రోజుల్లో గాజాలో మొత్తం 1,283మంది చనిపోగా, 7100 మందికి పైగా గాయపడ్డారు. కాగా, గాజాలో ఐక్యరాజ్య సమితి నిర్వహిస్తున్న పాఠశాలపై దాడి జరగడం ఇది రెండోసారి. అయితే రాకెట్ దాడులు జరపడానికి హమాస్ పాఠశాల భవనాలను తమ స్థావరాలుగా ఉపయోగించుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. అంతేగాక ఈ దాడితో తమకు సంబంధం లేదని వాదిస్తోంది.