గత సంవత్సరం గాయాల కారణంగానే తాను ఫాంను కొనసాగించలేకపోయానని తెలిపారు. తాను 2013లో గాయాలు పాలై తన ఫాంను కొనసాగించలేని స్థితిని సైనా గుర్తు చేసుకుంది. ఆ సమయంలో తాను కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలిపింది. ఒక ఉన్నత స్థానంలో ఉండి అందుకు తగినట్లుగా ప్రదర్శన కనబరచలేకపోతే ఎవరికైనా అలాగే అనిపిస్తోందని చెప్పింది.
అయితే అందుకు చాలా కారణాలున్నాయని తెలిపింది. ఆ సమయంలో తన కాలు ప్రాక్చర్ అయిందని చెప్పింది. వాటన్నింటి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని తెలిపింది. అయితే ఈ ఏడాది శుభారంభాన్ని దక్కించుకుకోవడం ఆనందాన్ని కలిగించిందని చెప్పింది. గతేడాదితో పోలిస్తే తన ఆటలో చాలా మార్పొచ్చిందని తెలిపింది.
సింధుతో ఫైనల్ మ్యాచ్ గొప్ప అనుభవమని, ఆమె చాలా బాగా ఆడుతోందని చెప్పింది. ఫైనల్ మ్యాచ్లో సింధుని కూడా అందరి ప్రత్యర్థుల్లానే భావించానని తెలిపింది. ఈ సంవత్సరం కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్ ఉన్న నేపథ్యంలో సాధనకే ఎక్కువ సమయం కేటాయిస్తానని, ఈ సీజన్లో కొన్ని ఎంపిక చేసిన టోర్నీల్లోనే పాల్గొంటానని తెలిపింది. ఇక ఇదే ఫిట్నెస్ను కొనసాగించడమే తన ముందున్న లక్ష్యమని తెలిపింది.
ఇక ఇండియన్ గ్రాండ్ ప్రీ టాప్ షట్లర్లతో జరిగిన హోరాహోరీ మ్యాచ్ల్లో గెలుపొందడం తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని తెలిపింది. తన విజయానికి కారణమైన బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పింది. ఆయన తనపై పూర్తి నమ్మకం ఉంచుతాడని, టోర్నీకి ముందు ఆయన తనకిచ్చిన అద్భుతమైన శిక్షణకు రుణపడి ఉన్నానని చెప్పింది.