గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా వేర్వేరు కారణాలపై అరెస్ట్ అయిన భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా, రెజిలింగ్ రెఫరీ వీరేంద్ర మాలిక్లను మంగళవారం విడిచిపెట్టారు. తగిన సాక్ష్యాధారాలు లేవన్న కారణంగా వారిపై మోపిన అభియోగాలను పోలీసులు ఉపసంహరించుకుని వారిని విచిచి పెట్టడంతో ఈ వివాదం సుఖాంతమైంది.
ఈ ఇద్దరు భారత అధికారులపై అభియోగాలను ఉపసంహరించుకున్నారని, ఈ వ్యవహారం షరీఫ్ కోర్టులో విచారణకు రాలేదని భారత హైకమిషన్ అధికారి ఒకరు చెప్పారు. ఈ ఇద్దరి అధికారులను నిర్దోషులుగా విడిచిపెట్టడంతో ఈ కారణంగా కామన్వెల్త్ గేమ్స్ చివరి రోజున చాలా ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్న భారత ప్రతినిధి బృందం ఊపిరి పీల్చుకుంది.
మద్యం మత్తులో వాహనం నడిపారన్న ఆరోపణపై మెహతాను స్కాట్లాండ్ పోలీసులు గత శనివారం రాత్రి అరెస్టు చేయగా, లైంగిక వేధింపుల ఆరోపణలపై మాలిక్ను అరెస్టు చేశారు. అయితే ఈ ఇద్దరు అధికారులు భారత ప్రతినిధి బృందంతో పాటుగా గేమ్స్ విలేజిలో ఉండటం లేదని, నగరంలోని ఓ హోటల్లో వీరు బస చేసినట్లు చెబుతున్నారు.
ప్రాథమిక దర్యాప్తు తర్వాత వీరిపై మోపిన అభియోగాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లభించనందున పోలీసులు వీరిని నిర్దోషులుగా విడిచిపెట్టినట్లు భారత ప్రతినిధి బృందం వెంట వెళ్లిన ఉత్తరప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి పాండే వెల్లడించారు.