పురుషుల 57 కిలోల ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్లో అమిత్ కుమార్ 3-1 తేడాతో నైజీరియాకు చెందిన ఎబిక్వెమినోమో వెల్సన్ను మట్టి కరిపించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, మహిళల 48 కిలోల ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్లో వినేష్ 3-1 తేడాతో ఇంగ్లాండ్ రెజ్లర్ యానా రట్టిగన్ను చిత్తుచేసి పసిడి పతకాన్ని చేజిక్కించుకుంది.
అలాగే పురుషుల 74 కిలోల ఫ్రీస్టయిల్ ఫైనల్ బౌట్లో ఒలింపిక్ మెడలిస్టు సుశీల్ కుమార్ విజేతగా నిలిచి భారత్కు మంగళవారం మూడో పసిడి పతకాన్ని అందించాడు. పాకిస్తాన్ రెజ్లర్ కమర్ అబ్బాస్తో జరిగిన ఈ బౌట్లో సుశీల్ కుమార్ 8-0 తేడాతో తిరుగులేని విజయం సాధించాడు. దీంతో భారత్ మొత్తం 33 పతకాలతో ఐదో స్థానానికి దూసుకెళ్లింది.
హర్ప్రీత్కు రజతం
కామన్వెల్త్ క్రీడల్లో షూటర్ హర్ప్రీత్ సింగ్ భారత్కు రజత పతకాన్ని అందించాడు. హర్యానాకు చెందిన హర్ప్రీత్ సింగ్ (33) మంగళవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్తోల్ ఈవెంట్ ఫైనల్ రెండు రౌండ్లలో ఉత్కంఠ భరితమైన పోటీని అధిగమించి ఈ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అంతకుముందు జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో అగ్రస్థానంలో నిలిచిన హర్ప్రీత్ ఫైనల్ రౌండ్లో 21 సార్లు లక్ష్యాన్ని ఛేదించి ద్వితీయ స్థానంలో నిలిచాడు.
మానవ్జీత్కు కాంస్యం
పురుషుల ట్రాప్ ఈవెంట్లో మానవ్జీత్ సింగ్ సంధు మంగళవారం భారత్కు కాంస్య పతకాన్ని అందించాడు. ఈ ఈవెంట్ సెమీఫైనల్స్లో మొత్తం 15 లక్ష్యాలకు గాను 13 లక్ష్యాలను ఛేదించి తృతీయ స్థానంలో నిలిచిన మానవ్జీత్ ఆ తర్వాత కాంస్య పతకం కోసం జరిగిన పోరులో ఆస్ట్రేలియాకు చెందిన ప్రఖ్యాత షూటర్ మైఖేల్ డైమండ్ను ఓడించాడు.
ఏడోరోజైన మంగళవారం గ్లాస్గోలో పతకాలు సాధించిన వారు.
బంగారు పతకాలు సాధించిన వారు...
సుశీల్ కుమార్ - రెజ్లింగ్
అమిత్ కుమార్ - రెజ్లింగ్
వినేష్ - రెజ్లింగ్
సిల్వర్ పతకాలు సాధించిన వారు...
సంజీవ్ రాజ్పుత్ - షూటింగ్
హర్ప్రీత్సింగ్ - షూటింగ్
రాజీవ్ తోమర్ - రెజ్లింగ్
కాంస్య పతకాలు సాధించిన వారు...
గగన్ నారంగ్ - షూటింగ్
మానవ్జీత్ సింగ్ సంధు - షూటింగ్
లజ్జా గోస్వామి - షూటింగ్
చంద్రకాంత్ మాలి - వెయిట్ లిఫ్టింగ్