హైదరాబాద్: బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్పై గుత్తా జ్వాలా నిప్పులు చెరిగారు. జాతీయ కోచ్ గోపీతో గతంలోనూ చాలాసార్లు విభేదించిన హైదరాబాదీ జ్వాలా ఇప్పుడా విమర్శలను తీవ్రతరం చేసింది. గోపీ తీరు చూస్తుంటే జాతీయ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తున్నాడా లేక కొంతమంది ఆటగాళ్లకా..? అనే సందేహం కలుగుతుందని ఘాటుగా విమర్శించింది. గోపీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నాడని ఆక్రోశించింది.
కామన్వెల్త్ పతకాలు నెగ్గి నగరానికి చేరుకున్న తమకు స్వాగతం లభించకపోవడాన్ని అందుకు ఉదాహరణగా చూపింది. కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన తర్వాత హైదరాబాద్ చేరుకున్న కశ్యప్, గురుసాయి, సింధులకు ఘనస్వాగతం లభించిందని, కానీ డబుల్స్లో పతకం నెగ్గిన తనకు కనీసం సమాచారం కూడా లేదని, జాతీయ కోచ్గా గోపీ అందరినీ కలుపుకుపోవాలని, కానీ తనకు ఇష్టమైన కొంతమందినే వెనకేసుకొస్తున్నాడని ఓ ఆంగ్ల పత్రికతో వ్యాఖ్యానించింది.
కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ను కలవడానికి వెళ్లినప్పుడు ఇద్దరి మధ్య వివాదం ముదిరింది. ఈ సందర్భంగా తన కోచ్ ఎస్ఎం ఆరిఫ్ సర్ అని గోపీచంద్ కాదని జ్వాల.. సీఎంకు చెప్పడంతో చుట్టూ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. అయితే గోపీచంద్కు కూడా ఆరిఫ్ సారే కోచ్ అని ఎవరో చెప్పినప్పుడు.. గోపీ నవ్వి ఊరుకున్నాడు. ఈ విషయమై జ్వాల మండిపడింది.
ఆరిఫ్ సార్ శిష్యురాలినని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను.. కానీ గోపీ ఆయన శిష్యరికం చేశానని చెప్పడానికి ఎందుకు సంకోచిస్తున్నాడని జ్వాల ప్రశ్నించింది. ఏ ప్లేయర్ అయినా తనకు కొంత గుర్తింపురావాలని, ప్రశంసలు అందాలని కోరుకోవడం సాధారణమని, కానీ వరల్డ్ చాంపియన్షిప్లో పతకం సాధించినా జ్వాల-అశ్విని జోడీ బాగా ఆడిందన్న మాట జాతీయ కోచ్ నోటివెంట ఇంతవరకు రాలేదన్నారు.
ఎంతోమంది యువ క్రీడాకారులు గోపీ వల్ల ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ పెదవి విప్పలేకపోతున్నారని, తానేంటో నిరూపించుకున్నానని, అందుకే నేను ధైర్యంగా మాట్లాడుతున్నానన్నారు. ఆటగాళ్లను ప్రభావితం చేయగల అధికారం మొత్తం అతని గుప్పిట్లోనే ఉందన్నారు. జాతీయ కోచ్గా ఉంటూనే ప్రయివేటు అకాడమీని నడుపుతున్నాడు. జాతీయ సెలెక్షన్ ప్యానల్ చీఫ్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్కు కార్యదర్శి. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ పరిపాలనా మండలి సభ్యుడిగా అన్ని రకాల అధికారాలు చేతిలో ఉంచుకుని ఏకచత్రాధిపత్యాన్ని చెలాయిస్తున్నాడని ఆరోపించారు.
తన స్థానంలో మరొకరు ఉంటే.. ఎప్పుడో ఆటకు గుడ్బై చెప్పేవాళ్లని, మిక్స్డ్ డబుల్స్ జోడీ డిజును 2006లో తనతో ఆడటానికి అనుమతించలేదని, ఒలింపిక్స్కు అర్హత సంపాదించాలని తాను మిగతా టోర్నీలు ఆడుతుంటే.. గోపీ కోరుకున్నట్లు జాతీయ క్యాంపునకు తాను హాజరుకాలేదని అతన్నికూడా ఆపేశాడని ఆరోపించారు. దీనిపై గోపీచంద్ మాట్లాడుతూ.. వాళ్ల అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ వాళ్లకు ఉందని, తనకేమీ ఇబ్బంది లేదన్నారు.