న్యూఢిల్లీ: సైనా నెహ్వాల్ తీరు పైన గుత్తా జ్వాలా మండిపడింది. ఓ ఆంగ్ల న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె సైనా తీరును తప్పు పట్టారు. ప్రభుత్వం నుంచి తనకు రావాల్సిన నగదు రివార్డు గురించి సైనా నెహ్వాల్ బహిరంగంగా అందరికీ తెలిసేలా చెప్పడం సరికాదని అభిప్రాయపడింది.
అసలు దీనిపై ఎలా స్పందించాలో తనకు అర్థం కావడం లేదంది. సైనాకు మంచి పేరుందని, తనకు ఇవ్వాల్సిన నగదుపై వ్యక్తిగతంగా ముఖ్యమంత్రిని లేదా సదరు మంత్రులను కలసి మాట్లాడాల్సిందని సూచించింది. అంతేగానీ, ఇలా పబ్లిక్గా చెప్పడం ఓ స్పోర్ట్స్ పర్సన్ అయిన తన స్థాయికి సరిపడలేదని అసహనం వ్యక్తం చేసింది.
డబ్బుకు సంబందించిన విషయాల్లో తన తీరు భిన్నంగా ఉంటుందని, ఇలా పబ్లిక్గా మాట్లాడనని జ్వాలా చెప్పింది. నేరుగా మంత్రులను కలసి సమస్యను పరిష్కరించుకుంటానని స్పష్టం చేసింది. సైనా తీరు హుందాతనంగా లేదని చెప్పింది.
కాగా, 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన సైనాకు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.50 లక్షల నజరానా ప్రకటించింది. అది ఇంత వరకు ఆమెకు అందలేదు. ఇటీవల ఆ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దాంతో, ఆమెకు రావల్సిన నజరానాను కూడా ఇస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తెలిపింది. దీనిపై గుత్తా జ్వాలా అసంతృప్తి వ్యక్తం చేసింది.