కోల్కతా: ఒలింపిక్ పతక విజేత, బాక్సర్ మేరీ కోమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తనపై అత్యాచార యత్నం జరిగిందని మేరీ కోమ్ తెలిపారు. పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో ఫిక్కీ మహిళా విభాగం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. ఇటీవల మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆమె వీటిపై తీవ్రంగా స్పందించారు.
దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, ప్రతీరోజు ఏదో ఒక చోట అత్యాచారం జరిగిందంటూ వార్తలు వస్తున్నాయని ఆమె తెలిపారు. తాను 18 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు తనపై అత్యాచార యత్నం జరిగిందని.. అయితే అందుకు పాల్పడేందుకు యత్నించిన వాడిని చితకబాదానని ఆమె వెల్లడించించారు.
తాను ఫిట్గా ఉన్నందునే అతన్ని అడ్డుకోగలిగానని మేరీ కోమ్ తెలిపారు. ప్రస్తుతం మహిళలు ఒంటరిగా తిరగాలంటే భయమేస్తుందని అందుకే మహిళలకు ఫిజికల్ ట్రైనింగ్ అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు.
సాధారణంగా ఆడవాళ్లు బలహీనులు కావచ్చు, కానీ తమను తాము రక్షించుకోవాలంటే వారికి మనోధైర్యం కావాలని మేరీ కోమ్ చెప్పారు. తమపై దాడి చేసే వారిని నిర్భయంగా ఎదుర్కొనే సత్తాని అలవరుచుకోవాలని మేరీ కోమ్ సూచించారు.