లక్నో: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ స్థానిక కోర్టులో శనివారం ఊరట లభించింది. 2008 నవంబర్ 8న ఒక కార్యక్రమానికి హాజరైన సానియా అందరూ జాతీయ గీతాన్ని పాడుతున్న సమయంలో చేతులు వెనక్కు పెట్టుకొని నిర్లక్ష్యంగా నిలబడిదంటూ ఆమెపై కేసు నమోదైంది.
జాతీయ గీతాన్ని సానియా మీర్జా అవమానించారంటూ ఫిర్యాదుదారులు ఆరోపించారు. అయితే, కేసును విచారించిన అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ సీతారాం ఈ అభియోగాలను కొట్టేశారు. ఈ కేసు నవంబర్ 8, 2008 నుండి వడుస్తోంది. ఇప్పుడు కేసు కొట్టవేయడంతో సానియాకు కోర్టులో ఊరట లభించింది.
కాగా, సైబరాబాద్ పోలీసులు హైటెక్ సిటీలోని మహిళా టెక్కీల భద్రత కోసం నిర్మించిన లఘు చిత్రంలో సానియా నటించిన విషయం తెలిసిందే. అభయ యాక్షన్ ప్లాన్ పేరు మీద ఐటి కారిడార్లో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల రక్షణకు తగిన చర్యలను పోలీసులు చేపట్టారు.
"మనం ప్రయాణించే అన్ని వాహనాలూ శ్రేయస్కరమని చెప్పలేం. సైబరాబాద్ పోలీసులు నా వద్దకొచ్చి లఘు చిత్రంలో నటించాలని అడిగారు. ఒక్కసారిగా ఆశ్చర్యపడ్డాను. కానీ ఒక మహిళగా ఆలోచించి నటించాను. అన్ని పరిస్థితులు ఒకేలా ఉండవు. అందుకే మనమూ కొన్ని రక్షణ చర్యలు తీసుకోవాలి" అని టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అప్పుడు అన్నారు.