రాంచీ: మతం మార్చుకోవాలంటూ తన భర్త వేధింపులకు పాల్పడుతున్నట్లు షూటర్ తారా సహదేవ్ ఆరోపిస్తున్నారు. తాను గతంలో పెళ్లి చేసుకున్న రంజిత్ కుమార్ తాజాగా మతం మార్చుకోవాలంటూ వేధిస్తున్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని అసలు పేరు రకిబుల్ హసన్ ఖాన్ అని ఆ ఫిర్యాదులో పేర్కొంది.
తాము ఇద్దరం జూలై 7న పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది. తమ పెళ్లికి వీవీఐపీలు, రాజకీయ నాయకులు వచ్చినట్లు తెలిపింది. అయితే, పెళ్లైన మరుసటి రోజు నుండి సమస్యలు వచ్చాయని తెలిపింది. ఇరవై ఇరవై అయిదు మంది హాజీస్ను పిలిచి తనను మతం మార్చుకోమని ఒత్తిడి చేసేవాడని పేర్కొంది.
నిత్యం మతం మార్చుకోవాలంటూ భర్త వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిపింది. ఒక నెల నుండి అతని వేధింపులు మరీ ఎక్కువయ్యాయని ఆరోపించింది. రకిబుల్ హసన్ ఖాన్ అనే అతను రంజిత్ కుమార్గానే తనకు పరిచయమయ్యాడని తెలిపింది. అతను తన మతాన్ని కప్పిపుచ్చి, మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. ఆ క్రమంలోనే తామిద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపింది.
స్థానికులకు కూడా రంజిత్ కుమార్గానే పరిచయమైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాఫ్తులే తేలింది. ఆగస్టు 22వే తేదీన అతని పైన ఐపీసీ 295ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. అతను ఉన్న రెండు ఇళ్లతో పాటు ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, తారా సహదేవ్ను మతం మార్చుకోమని చెబుతున్న ఆ భర్త.. ఆమె పైకి కుక్కలను ఉసిగొల్పడం, రోజుల తరబడి తిండి పెట్టకుండా వేధించడం చేశాడని ఆరోపిస్తున్నారు.
తనను నిర్బంధించి, భౌతికంగా వేధింపులకు గురి చేసినట్లు తెలిపింది. పోలీసులతో పాటు స్టేట్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ చీఫ్, బీజేపీ రాష్ట్ర చీఫ్కు ఫిర్యాదు చేయాలని భావిస్తోంది. కాగా, ఈ సంఘటన పైన వీహెచ్పీ ఆందోళన వ్యక్తం చేసింది. సోమవారం నుంచి రాంచీ బందుకు పిలుపునిచ్చింది. కాగా, తారా 2011-12లో జాతీయ స్థాయిలో జరిగిన తూర్పు భారతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది.