విజయవాడ: భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాంతంలో భూములు కొన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ వర్గాలే చెప్పాయి. మంగళగిరిలో సచిన్ 100 ఎకరాలు కొన్నట్టు ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతుండడంతోనే సచిన్ ఇక్కడ భూములు కొన్నాడని కొందరు అంటున్నారు. అయితే ఇక్కడి భూముల ధరలు పెంచేందుకు ఇదో ఎత్తుగడ అని కొందరు కొట్టిపారేస్తున్నారు.
వచ్చే నెల 1వ తేదీన సచిన్ టెండూల్కర్ విజయవాడ వస్తుండడాన్ని ఆ ప్రచారానికి ముడిపెడుతున్నారు. ఆగస్టు 1వ తేదీన ఆయన పివిపి మాల్ను ప్రారంభించడానికి విజయవాడ వస్తున్నారు.
కాగా, పలువురు ప్రముఖులు విజయవాడ, గుంటూరుల్లో, ఆ రెండు ప్రాంతాలకు సమీపంలోని ప్రాంతాల్లో పెద్ద యెత్తున భూములు కొనుగోలు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ఈ ప్రాంతంలో గత నెల రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది.