సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీని హైదరాబాద్ స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆదివారం సొంతం చేసుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో స్పెయిన్కు చెందిన కరోలినా మారన్ పైన 21-18, 21-12 తేడాతో రెండు వరుస సెట్లలో విజయం సాధించింది. ఈ ఏడాదిలో సైనా నెహ్వాల్కు ఇది రెండో టైటిల్.
కాగా, ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి, టాప్ సీడ్ షిజియాన్ వాంగ్పై సైనా నెహ్వాల్ శనివారం 21-19, 16-21, 21-15 తేడాతో విజయం సాధించి సంచలనం సృష్టించింది.
గత రెండు పర్యాయాలు వాంగ్ను ఎదుర్కొన్నప్పుడు పరాజయాలను చవిచూసిన సైనా ఈసారి సర్వశక్తులు ఒడ్డి పోరాడింది. ఒకరి బలాబలాలు, వ్యూహాల గురించి మరొకరికి బాగా పరిచయం ఉన్న కారణంగా పోరాటం హోరాహోరీగా సాగింది. మొదటి గేమ్లోనే ఒక దశలో ఇద్దరూ చెరి 19 పాయింట్లతో సమవుజ్జీలుగా నిలిచారంటే వారు ఏ విధంగా శ్రమించారో ఊహించుకోవచ్చు.
అతి కష్టం మీద మొదటి సెట్ను గెల్చుకున్న సైనాకు రెండో సెట్లో ఓటమి ఎదురైంది. ఎదురుదాడికి దిగిన వాంగ్ రెండో సెట్ను కైవసం చేసుకుంది. అయితే అత్యంత కీలకంగా మారిన మూడో సెట్లో సైనా విజృంభించగా వాంగ్ పోరాటం విఫలమైంది. ఆదివారం సైనా కరొలినా మారిన్ను ఢీకొని సిరీస్ గెలుచుకుంది.