న్యూఢిల్లీ: కెరీర్ రేటింగ్ పాయింట్లే లక్ష్యంగా ఆసియా గేమ్స్ను కాదని డబ్ల్యూటీఏ టోర్నీలవైపు మొగ్గు చూపిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మనసు మార్చుకుంది. ఈనెల 19న ఆరంభమయ్యే ఆసియా క్రీడల్లో దేశం తరఫున బరిలోకి దిగాలని హైదరాబాదీ టెన్నిస్ స్టార్ నిర్ణయించుకుంది.
వుహాన్ డబ్ల్యూటీఏ ఈవెంట్లో పాల్గొనాలని మూడ్రోజుల క్రితం సానియా భావించింది. ఆమె నిర్ణయానికి అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) కూడా ఆమోదం తెలిసింది. ఈ టోర్నీలో పాల్గొంటే సానియా ఖాతాలో 900 రేటింగ్ పాయింట్లు చేరే అవకాశముంది.
కానీ, చివరకు సానియా తన నిర్ణయాన్ని మార్చుకుంది. 'తొలుత ఆసియా గేమ్స్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నా. కానీ, ఈ నిర్ణయం సరైంది కాదనిపించింది. అందుకనే మనసు మార్చుకున్నా. 900 రేటింగ్ పాయింట్లను త్యాగం చేస్తున్నానని తెలుసు. కానీ, కొన్ని సందర్భాల్లో ఇలాంటి నిర్ణయాలు తప్పనిసరి' అని సానియా పేర్కొంది.
అయితే ఆసియాడ్ తర్వాత సానియా చైనా ఓపెన్లో బరిలోకి దిగుతుంది. ఈ టోర్నీ ఈనెల 29న మొదలవుతుంది. కాగా, సానియా మీర్జా శుక్రవారంనాడు తన తల్లి నసీమా మీర్జాతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకుంది.