హైదరాబాద్: ఐస్ బకెట్ చాలెంజ్ను స్వీకరించిన భారతీయుల్లో హైదరాబాదీ టెన్నిస్ తార సానియా మీర్జా కూడా చేరిపోయారు. సోషల్ మీడియాలో అది హల్చల్ చేస్తోంది. నామినేట్ అయిన తర్వాత ఐస్ బకెట్ చాలెంజ్కు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండు సార్లు మర్యాదగా తిరస్కరించారు.
అమ్యోట్రోఫిక్ లేటరల్ స్క్లోరోసిస్పై అవగాహనను పెంచడానికి ఐస్ కోల్డ్ వాటర్ను ఒంటిపై కుమ్మరించుకునే పద్ధతిని అమలులోకి తెచ్చారు. సవాల్ను స్వీకరించి బకెట్ ఐస్ వాటర్ను కుమ్మరించుకున్న తర్వాత ఆ వ్యక్తి తన వీడియోను పోస్టు చేసి, మరో ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.
టెన్నిస్ కోర్టులో ఉండగా ఎవరో ఒకరు భారీ ప్యాకెట్లోని ఐస్ను సానియా మీర్జా తలపై కుమ్మరించిన దృశ్యం తొలి వీడియోలో రికార్డయింది. అయితే, అభిమానులు దాంతో సంతృప్తి చెందలేదు. ఇది ఐస్ ప్యాకెట్ చాలెంజ్ కాదని, ఇది బోర్గా ఉందని, ఐస్ బకెట్ చాలెంజ్ తీసుకోవాలని అన్నారు. ఆ వ్యాఖ్యలను సానియా మీర్జా వీడియో కింద పోస్టు చేసారు.
దాంతో సానియా రెండో సారి సవాల్ను స్వీకరించారు. ప్రజలు అది సరిపోలేదని అన్నారు కాబట్టి 2 ఎఎల్ఎస్ ఐస్ బకెట్ చాలెంజ్లు తీసుకున్నానని రెండో వీడియో కింద రాశారు. ఆ వీడియోను పోస్టు చేసిన తర్వాత మహేష్ భూపతి, రితేష్ దేశ్ముఖ్, యువరాజ్ సింగ్లను ఆమె నామినేట్ చేశారు.
ఐస్ బకెట్ చాలెంజ్ను స్వీకరించి భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సిఇవో సత్య నాదెళ్ల తన తలపై బకెట్ ఐస్ వాటర్ను కుమ్మరించుకున్న విషయం తెలిసిందే.