న్యూఢిల్లీ: ఇండియా సిమెంట్స్లో మహేంద్ర సింగ్ ధోని ఏ పాత్ర పోషిస్తున్నారంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఐసీసీ ఛీప్ ఎన్ శ్రీనివాసన్ ఘాటుగా స్పందించారు. చెన్నైలో ఐసీసీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్పాట్ ఫిక్సింగ్పై స్పందించేందుకు నిరాకరించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పండిందంటూ జస్టిస్ ముద్గల్ కమిటీ సుప్రీం కోర్టులో నివేదికను సమర్పించింది. నివేదికపై స్పందించమనగా సుప్రీం కోర్టులో ఉన్నందున్న దానిపై మాట్లాడేందుకు నిరాకరించారు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ఎలాంటి విచారణ లేకుండా ఐపీఎల్ నుంచి రద్దు చేయాలని బీసీసీఐని సుప్రీం కోర్టు కోరింది కదా... ఇంకా మీరు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ధోనిని ఎందుకు తొలిగించడం లేదని ప్రశ్నించగా... నేనెందుకు ధోనిని రాజీనామా చేయమని అడగాలన్నారు.
మరో విలేకరి ఇండియా సిమెంట్స్లో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పాత్ర ఏంటని అడగ్గా.. శ్రీనివాసన్ ఒక్కసారిగా ఒత్తిడికిలోనై నేను నీకెందుకు చెప్పాలని ఎదురు ప్రశ్నించారు. ఇక ముద్గల్ కమిటీ సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో ఎన్ శ్రీనివాసన్కు క్లీన్ చిట్ ఇచ్చింది.
ముద్గల్ కమిటీ విచారణ పూర్తయ్యే వరకు బీసీసీఐ అధ్యక్షుడు పదవికి దూరంగా ఉండమని సుప్రీం తీర్పునిచ్చింది. అంతేకాదు బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉండి ఐపీఎల్లో ఫిక్సింగ్ జరుగుతున్నప్పుడు తెలిసి కూడా మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదని సుప్రీం మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే.
బీసీసీఐ అధ్యక్షుడిగా, చెన్నై సూపర్ కింగ్స్ యజమానిగా పరస్పర విరుద్ధ ప్రయోజనాలు కలిగిన పదవుల్లా ఎలా ఉంటారని ప్రశ్నించిన విషయం తెలిసిందే. బీసీసీఐ, ఐపీఎల్ వేరు కాదు. బీసీసీఐ సృష్టించిన కమిటీనే ఐపీఎల్. ఈ రెండింట్లో ఒకే వ్యక్తి రెండు పదవుల్లో ఎలా ఉంటాడు. బీసీసీఐ అధ్యక్షుడు క్రికెట్ను సజావుగా నడిపించాలని పేర్కొంది.
అతడికే ప్రాంఛైజీ ఉంటే ఖచ్చితంగా అనుమానాలొస్తాయి. ప్రాంచైజీల పై నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు... తనకూ ఓ ప్రాంజైజీ ఉన్న అధ్యక్షుడు మౌనంగా ఉంటాడా? ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవాడానికి వీల్లేదని ధర్మాసనం పేర్కొన్న విషయం తెలిసిందే.