ఉరేసుకుంటా, స్నేక్గ్యాంగ్పై ఏది: నాయినికి గౌడ్
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో తాను పాల్గొనలేదని రుజువు చేస్తే ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ముందు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ తాను పాల్గొన్నట్లు రుజువైతే హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అని తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ (టిఎన్ఎస్ఎఫ్) అధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ శనివారం సవాల్ విసిరారు.
ఉస్మానియా విద్యార్థులు, నిరుద్యోగుల ఉద్యమం వెనుక టీడీపీ కుట్ర ఉందన్న నాయిని వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. నాయినికి దమ్ముంటే ఆర్ట్స్ కళాశాల ముందుగానీ, విద్యార్థుల అమరవీరుల స్థూపం వద్దగానీ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.
1997నుంచి ఇప్పటి వరకూ 17 సంవత్సరాల విద్యార్థి జీవితమంతా ఉద్యమాలతోనే గడిచిందన్నారు. నాయినికి వయసు పైబడినందున ఉద్యమకారులపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మంత్రులు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా విద్యార్థి, నిరుద్యోగుల ఉద్యమాల నుంచి తమను వేరు చేయలేరన్నారు. విద్యార్థుల ఉద్యమం వెనుక టీడీపీ కుట్ర ఉందని కేసీఆర్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నాయిని చెప్పడం సరికాదన్నారు.
కోదండరామ్, ఆర్ కృష్ణయ్య, విమలక్కల సమక్షంలో చర్చకు రావాలని, తాను ఉద్యమంలో పాల్గొన్నానో లేదో నిరూపిస్తానన్నారు. స్నేక్ గ్యాంగ్ లాంటి ముఠాల పైన ప్రతాపం చూపకుండా ఉద్యమ నేతల పైన హోంమంత్రి ప్రతాపం చూపడం సిగ్గుచేటు అని ఆంజనేయులు గౌడ్ విమర్శించారు.