వదిలేసిందని అమ్మాయిపై వేధింపులు (ఫొటో)
హైదరాబాద్: తాను ప్రేమిస్తున్న యువతి తనను నిర్లక్ష్యం చేస్తుండడంతో కక్షగట్టిన ఓ యువకుడు ఆమె పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచి వేధిస్తున్నాడు. అతన్ని సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. సైబర్ క్రైమ్ ఎసిపి ఎస్ జయరాం ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
రాజేంద్రనగర్కు చెందిన రాజేష్ (23) ప్రైవేట్ ఉద్యోగి. తన ఇంటి సమీపంలో ఉండే యువతిని ప్రేమిస్తున్నాడు. కొద్ది కాలం క్రితం రాజేష్ ఉద్యోగం మానేయడంతో అప్పుల్లో కూరుకుపోయాడు. అతని ప్రవర్తన నచ్చకపోవడంతో ఆ యువతి అతనిిక దూరమైంది. ఆమె మరో యువకుడితో పరిచయం పెంచుకుంది.
దాంతో కక్ష గట్టిన రాజేష్ రెండు నెలల క్రితం ఆ యువతి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా తెరిచాడు. అందులో ఆమె సెల్ నెంబర్ పోస్టు చేశఆడు. ఆ నెంబర్కు ఫోన్ చేయవచ్చునని రాశాడు. దాంతో ఫేస్బుక్కులోని సెల్ నెంబర్కు యువకులు ఫోన్లు చేయడం ప్రారంభించారు.
తీవ్ర ఆవేదనకు గురైన యువతి క్రైమ్ డిసిపి జానకీ షర్మిలకు ఫిర్యాదు చేశారు. డిసిపి ఆదేశాల మేరకు ఎస్ఐలు కె. శ్రీనివాస్, ఎం. మహిపాల్ రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. రాజేష్ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు.