తెలంగాణ ప్రజలకు పండగరోజు: చంద్రబాబు
హైదరాబాద్: తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజలు మరిచిపోలేని రోజని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన బుధవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తెలంగాణకు సెప్టెంబర్ 17 పండగ రోజని అన్నారు.
ఎంతోమంది సాయుధ వీరుల త్యాగాలతోనే హైదరాబాద్ రాష్ట్రం మన దేశంలో విలీనమైందని చెప్పారు. ఈ సందర్భంగా వీరుల త్యాగాలను గుర్తుచేసుకోవాలని అన్నారు. 1947, ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వస్తే.. తెలంగాణ ప్రజలకు మాత్రం సెప్టెంబర్ 17, 1948లో స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు జరుపుకునే ఈ పండగ ఏ మతానికో.. వర్గానికో వ్యతిరేకం కాదని చెప్పారు.
గతాన్ని గుర్తుచేసుకుని భవిష్యత్లో ముందుకెళ్లాలని చంద్రబాబు అన్నారు. చరిత్రను ఎవరూ మార్చలేరని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రాలలోని 16 జిల్లాలతోపాటు హైదరాబాద్ రాష్ట్రంలోని 8 జిల్లాలు సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమయ్యాయని గుర్తుచేశారు. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమురంభీం, రావినారాయణరెడ్డి, షోయబుల్లాఖాన్ లాంటి చాలా మంది నేతలు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారని చెప్పారు. వీరి పోరాటంతోనే తెలంగాణ ప్రజలకు మోసం కలిగిందని అన్నారు.
తెలంగాణా భవన్లో నాయిని
తెలంగాణ భవన్లో హోంమంత్రి నాయిని నర్సింహారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తాము గతంలో ఎప్పుడూ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేయలేదని అన్నారు. గోల్కొండ కోట వద్ద బిజెపి కార్యకర్తలను అరెస్ట్ చేసిన విషయం తనకు తెలియదని చెప్పారు.
గాంధీభవన్లో పొన్నాల
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య గాంధీభవన్లో జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత జానారెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కర్ణాటక, మహారాష్ట ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తుంటే.. ఇక్కడ సిఎం కెసిఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రజలకు మాయమాటలు, హామీలు ఇచ్చిన టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కెసిఆర్ ప్రభుత్వం వంద రోజుల్లో వంద అబద్ధాలు, వెయ్యి తప్పులు చేసిందని పొన్నాల మండిపడ్డారు. ప్రతిపక్షాలంటే లెక్కలేకుండా కెసిఆర్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సూచించారు.