కోట్లు విలువ చేసే మొఘల్ కాలం నాటి ముఖ్మల్
వరంగల్: మొఘల్ చక్రవర్తి నుండి తమ పూర్వీకులకు బహుమతిగా లభించిన రూ.కోట్ల విలువ చేసే వజ్రాలు పొదిగిన ముఖ్మల్ వస్త్రం ప్రభుత్వానికి అప్పగించాలని భావిస్తున్నట్లు వరంగల్ జిల్లా చేర్యాలకు చెందిన ఫాతిమా మున్నీసా బేగం బుధవారం తెలిపారు. దాదాపు పదితరాలుగా ఇది తమ వద్దే ఉంటున్నా పెద్దగా పట్టించుకోలేదని, తమ పెళ్లి సందర్భంలో రాసుకున్న లేఖను ఇటీవల ఆంగ్లంలో తర్జుమా చేయించగా మొఘల్ క్లాత్ ఫర్ దుల్హన్ అని ఉండటంతో అనుమానం వచ్చిందన్నారు.
బంగారు దుకాణదారులకు దానిని చూపించగా కోట్లాది రూపాయల విలువ ఉంటుందని తెలిసిందన్నారు. కొన్నేళ్లుగా హైదరాబాదులో ఉంటున్న తాము అక్కడ ఈ విషయం తెలిస్తే ప్రాణానికి హానీ ఉంటుందని భావించి తాము స్వస్థలమైన చేర్యాలకు వచ్చామని తెలిపారు. ముందు ప్రచారంలోకి తీసుకు వచ్చి, తర్వాత అధికారులకు అప్పగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
కాగా, వంశపారంపర్యంగా వచ్చిన వజ్రాలు, నవరత్నాలు పొదిగిన మక్మల్ చున్నీని వరంగల్ ఎస్పీ ఆదేశాల మేరకు చేర్యాల ఎస్సై సూర్యప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక ఎస్బిహెచ్ బ్యాంక్లో బుధవారం భద్రపరిచారు.
చేర్యాల మండలానికి చెందిన ఖాజీ అబ్దుల్వలీ, రఫియాబీబీ మద్దూరులో టీచర్గా పనిచేస్తుండేవారు. ఫాతీమా మున్నీసా ఏకైక సంతానం. మొగల్ సామ్రాజ్య కాలం నాటి విలువైన వారసత్వ సంపదగా నవరత్నాలు, వజ్రాలు పొదిగిన చున్నీని ఆమెకు వివాహ సమయంలో కట్నంగా ఇచ్చారు. ఫాతీమా మున్నీసాకు నలుగురు కుమారులు, ఒక కుమార్తె. వారిలో ఇద్దరు కుమారులు మృతి చెందగా చేర్యాలలో ఉన్న ఇంటిని అమ్ముకొని హైదరాబాద్కు తరలివెళ్లారు.
అయితే వంశపారంపర్యంగా వచ్చిన ఆ చున్నీని ఇన్ని రోజులు చెక్కు చెదరకుండా వారు కాపాడుతూ వచ్చారు. హైదరాబాద్లో ఓ జెమాలజిస్టు వద్ద దీనిని చూపగా అది వజ్రాలు, నవరత్నాలతో పొదిగిన చున్నీ అని తెలపడంతో రక్షణ నిమిత్తం ప్రభుత్వానికి అందించేందుకు వారు ముందుకు వచ్చారు. అరుదైన సంపదను కాపాడి తమకు ప్రభుత్వం సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.