బతుకమ్మ: ఈటెల, మల్లు స్వరాజ్యం (పిక్చర్స్)
హైదరాబాద్: సమాజంలోని అంతరాలను చెరిపేందుకు బతుకమ్మ ఉత్సవాలు తోడ్పడతాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. మనిషిని మనిషిగా గుర్తిస్తూ అన్ని వర్గాల మధ్య అంతరాలు లేని సమాజం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు. బుధవారం సచివాలయ మహిళా ఉద్యోగుల సం ఘం ఆధ్వర్యంలో ‘బతుకమ్మ ఉత్సవాలు- పాటల పుస్తకం ఆవిష్కరణ- పురస్కారాలు' కార్యక్రమంలో ఈటెలతో పాటు డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి, కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ పాల్గొన్నారు.
తెలంగాణ జాతి అస్థిత్వం కనుమరుగవుతున్న సందర్భంలో ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారని, అదే ఉద్యమ స్ఫూర్తితో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రపంచమంతా పూలతో పూజ చేస్తారు కానీ తెలంగాణ ప్రజలు పూలకే పూజలు నిర్వహిస్తారని, ఇదే బతుకమ్మ పండుగ ప్రత్యేకత అని చెప్పారు.
తుల ఉమ మాట్లాడుతూ తెలంగాణ నడిబొడ్డు అయిన సచివాలయంలో బతుకమ్మ ఆడుతామని కలలో కూడా అనుకోలేదన్నారు. స్వయం పాలనలో తొలి బతుకమ్మ ఉత్సవాలు ఇక్కడ ఆడటం ఆనందంగా ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్ బతుకమ్మను అధికారిక ఉత్సవంగా ప్రకటించి పూర్వవైభవం తీసుకొచ్చారని కొనియాడారు.
బతుకమ్మ పాటల పుస్తకం
డాక్టర్ అడువాల సుజాత రచించిన బతుకమ్మ పాటల పుస్తకాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి ఆవిష్కరించారు.
కెసిఆర్కు ధన్యవాదాలు
బతుకమ్మ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్కు తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో పలువురు..
కార్యక్రమంలో రమా మేల్కోటె, రత్నమాల, సులోచన, దేవకీదేవి, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించిన పూర్ణ, ప్రొఫెసర్ అండమ్మ, లక్ష్మి, జూపాక సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ ఆడుతూ మల్లు స్వరాజ్యం
సచివాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పాల్గొన్నారు.
బతుకమ్మలతో ఇలా..
తెలంగాణ సచివాలయంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మలతో ఇలా కనిపించారు. ప్రముఖ రచయిత్రి జూపాక సుభద్ర కూడా పాల్గొన్నారు.
పద్మా దేవేందర్ రెడ్డి..
సచివాలయంలోని మహిళా ఉద్యోగులతో కలసి తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి బతుకమ్మ ఆడారు.